ఎస్కేయూ హాస్టల్ గదిలో విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ జువాలజీ సెకండియర్ చదువుతున్న లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని సోమవారం తన హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది.
అనంతపురం: రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు అధికమవుతున్నాయి. అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న లక్ష్మీ ప్రసన్న అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
లక్ష్మీ ప్రసన్న ఎమ్మెస్సీ జువాలజీ సెకండియర్ చదువుతోంది. రోజూలాగే సోమవారం ఉదయం కూడా కాలేజీకి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాలేజీ నుంచి తిరిగి వచ్చి.. గోదావరి హాస్టల్లో తనకు కేటాయించిన గదిలోకి వెళ్లింది.
అనంతరం గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం భోజనం కోసం హాస్టల్కు వచ్చిన విద్యార్థినులు ఇది గమనించి విద్యార్థులు హాస్టల్ అధికారులు, యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలియగానే యూనివర్శిటీ ఉపకులపతి రాజగోపాల్, రిజిస్ట్రార్ సుధాకర్ బాబు, ఇతర అధ్యాపకులు హాస్టల్కు చేరుకుని వివరాలు ఆరా తీశారు. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థిని మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీ ప్రసన్న గోరంట్ల మండలం చౌడేశ్వరి కాలనీకి చెందిన జయమ్మ, నాగరాజుల కుమార్తె. అయితే ఆమె ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటో తెలియరాలేదు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.