శిల్పారామమేనా?: బహిరంగ రొమాన్స్తో బరితెగిస్తున్న జంటలు!
తిరుపతి: పిల్లలు, పెద్దలు, కుటుంబసభ్యులతో మంచి వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు కోసం ఏర్పాటు చేసిన తిరుపతి శిల్పారామంలో అశ్లీల సంఘటనలో చోటు చేసుకుంటున్నాయి. శిల్పారామానికి జంటలుగా వస్తున్న చాలామంది యువతీయువకులు బహిరంగంగా రొమాన్స్ చేసుకుంటూ ఇతరులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి అశ్లీల కార్యకలాపాలతో కుటుంబాలు శిల్పారామానికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఆ జంటలకు శిల్పారామం సిబ్బంది కూడా సహకరిస్తుండటం విచారకరం.
తిరుచానూరు రోడ్డులోని ఈ శిల్పారామానికి ఇటీవల నగరానికి చెందిన ఓ పెద్ద మనిషి శిల్పారామ సందర్శనకు వెళ్లగా.. అక్కడ యువతీయువకుల బహిరంగ అసభ్యకర ప్రవర్తన వెగటు కలిగించింది. ఇదేంటని అడిగిన అతనిపై ప్రేమజంటలు దాడిచేశాయి. సమీపంలోనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారిని ప్రశ్నించకపోగా.. యువతీయువకులకు వత్తాసు పలికాడట. దీంతో ఆయన తన ఆవేదనను 'మీడియా'కు వెల్లడించాడు.
ఇప్పటికే ఈ బాగోతంపై పలుమార్లు మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ.. పరిస్థితి ఏమాత్రం మారకపోవడం గమనార్హం. ఇప్పటికీ పట్టపగలే, పరిసరాలను మరిచి.. ప్రకృతి ఒడిని పడక గదిగా మార్చిన తీరు విస్తుగొలుపుతోంది. ఇక సాయంత్రమైతే ఇలాంటి జంటల అకృత్యాలకు శిల్పారామం అనువుగా మారిందన్న సంగతి అవగతమవుతుంది. పెళ్లి కాని యువతీ యువకులు జంటగా ఇక్కడకు రావడం.. అక్కడి కుర్చీలపై అసభ్యకరంగా ప్రవర్తించడం సాధారణ సందర్శకులకు జుగుప్సాకరంగా ఉంటోంది.
కుటుంబ సభ్యులతో సాయంత్రం సరదాగా వచ్చిన వారికి ఇక్కడి పరిస్థితులు జీర్ణించుకోలేని విధంగా తయారయ్యాయి. చెట్ల చాటున, పొదల మాటున తిష్ట వేసి.. లోకాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాయి ఈ ప్రేమజంటలు. కాలేజీల నుంచి దొంగచాటుగా బయటపడి శిల్పారామానికి చేరుతున్న యువతీయువకులు.. పెద్దలు తిరుగుతున్నారు, చిన్నారులు చూస్తున్నారన్న స్పృహ కూడా లేకుండా తమ శృంగార కార్యకలాపాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు కళ్లు తెరిచి శిల్పారామాన్ని ఒక విభిన్న సంస్కృతీ సంప్రదాయాల నగరవాసికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే వేదికగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.