అమెరికాలో రోడ్డు ప్రమాదం:‘గీతం’ యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం
విశాఖపట్టణం:అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి మృతి చెందగా కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న గీతం సంస్థ పూర్వవిద్యార్థుల సమావేశంలో ప్రసంగించేందుకు ఆయన అమెరికా వెళ్లినట్లు తెలిసింది.
ప్రమాదం జరిగింది...ఇక్కడే
లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కాకు ఒక వ్యాన్ వంటి వాహనంలో వీరు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తితో పాటు మృతిచెందినవారు బసవపున్నయ్య వెలువోలు,ప్రసాద్ వీరమాచినేని,వెంకటరత్నం కడియాల, చిన్నాగా గుర్తించారు. వీరిలో ఇద్దరు లాస్ ఏంజిల్స్కు చెందిన ఎన్ఆర్ఐలు..వీరంతా వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు అలస్కా వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.
మూర్తి...మహా ప్రస్థానం
ఎంవివిఎస్ మూర్తి 1938, జూలై 3న తూర్పు గోదావరి జిల్లా మూలపాలెంలో పట్టాభిరామయ్య, మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణ మూర్తి. చిన్నప్పటినుంచే చదువులో బాగా చురుకుగా ఉండే ఈయన తదనంతర కాలంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేశారు. 1980లో గీతం ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించి ఆ తరువాత దాన్ని డీమ్డ్ యూనివర్సిటీగా మార్చి ఛైర్మన్గా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1991లో విశాఖ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో మరోసారి ఎంపిగా గెలిచారు. అనంతర కాలంలో రెండుసార్లు ఎమ్మెల్సీ అయ్యారు.
నందమూరి కుటుంబానికి...మరో నష్టం
‘గీతం' యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణం టీడీపీకే కాదు వ్యక్తిగతం గాను చంద్రబాబు కుటుంబానికి నష్టమే...అదెలాగంటే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ...రెండో కుమార్తెను ఎంవీవీఎస్ మూర్తి మనమడికి ఇచ్చి పెళ్లి చేశారు...అంటే బాలయ్య వియ్యంకుడి తండ్రే ఈయన. ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడే ఈ ఎంవివిఎస్ మూర్తి మనమడు భరత్...ఆ విధంగా ఇటీవలే హరికృష్ణను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన నందమూరి కుటుంబానికి, చంద్రబాబుకు, టిడిపి ఇది మరో దురదృష్టం. మూర్తికి మరో రాజకీయ నాయకునితో కూడా దగ్గర సంబంధం ఉంది...అదెలాగంటే మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు ఈ మూర్తి స్వయానా వియ్యంకుడు.
సిఎం చంద్రబాబు...దిగ్భ్రాంతి
గీతం వర్శిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంవీవీఎస్ మూర్తి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా ఎంవీవీఎస్ మూర్తి చేసిన సేవలు చిరస్మరణీయమని సిఎం చంద్రబాబు కొనియాడారు. విద్యావేత్తగా, విద్యాదాతగా ఎంవీవీఎస్ మూర్తి చెరగని ముద్ర వేశారని...గీతం సంస్థను స్థాపించి వేలాది విద్యార్థులను తీర్చిదిద్దారని అన్నారు. గాంధీజీ ఆదర్శాల కోసం పనిచేసిన ఎంవీవీఎస్ మూర్తి, గాంధీ జయంతి రోజే మృతి చెందడం యాధృచ్చికమని సంతాపం వెలిబుచ్చారు. ఆయన మరణం విద్యారంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. రోడ్డు ప్రమాదాల్లో వరుసగా టీడీపీ నేతలను కోల్పోవడం కలచి వేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
నారా లోకేష్...ఆవేదన
ఎంవీవీఎస్ మూర్తి మరణంపై మంత్రి నారాలోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి మూర్తి అని చెప్పారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో కూడా ప్రజా సమస్యలను లెవనెత్తి, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారని లోకేష్ గుర్తు చేసుకున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి అని నిరంతరం ప్రయత్నించిన వ్యక్తి అని కొనియాడారు. 80 ఏళ్ల వయస్సులో కూడా నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ, వారి సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి ఇక లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య...మంత్రుల సంతాపం
ఎంవీవీఎస్ మూర్తి మరణంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాసనమండలి సభ్యులు, గీతం వర్సిటీ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, లోకేష్, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, అలాగే మండలి చైర్మన్ ఎన్ఎండీ ఫరూక్ సంతాపం తెలియజేశారు. ఎంపీగా, శాసనమండలి సభ్యులుగా విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.