ఆ గనుల అక్రమ తవ్వకాలపై మీరు చేసిన దర్యాప్తు వివరాలు ఇవ్వండి:ఎపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్:గుంటూరు జిల్లాలో సున్నపురాయి అక్రమ తవ్వకాలపై ఏ విధమైన దర్యాప్తు జరిగిందో ఆ వివరాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హై కోర్టు ఆదేశించింది.
అలాగే ఆ అక్రమ మైనింగ్ పై దర్యాప్తు వివరాలు ధర్మాసనంకు సీల్డ్ కవర్ నివేదిక ఇవ్వాలంటూ సిబిసిఐడిని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా నడికుడి, పిడుగురాళ్ల, దాచేపల్లి, కేశనుపల్లి తదితర గ్రామాల్లో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇతరులతో కలిసి అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై హై కోర్టు బెంచ్ మంగళవారం మరోసారి విచారణ జరిపింది. చట్ట వ్యతిరేకంగా సాగుతున్న సున్నపురాయి గనుల తవ్వకాలపై ఏవిధమైన దర్యాప్తు జరిగిందో తెలియజేయాలని ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది.
విచారణ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ గనుల అక్రమ తవ్వకాలపై సీబీసీఐడీకి దర్యాప్తు అప్పగించామన్నారు. సిఐడి దర్యాప్తు జరుగుతోందని, రెండు వందలకుపైగా సాక్ష్యాల్ని విచారించిందని దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. దీంతో సిబిసిఐడి దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సీబీసీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సర్కారీ వైద్యం అందకపోవడంపై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. అర్హత లేనివారితో వైద్యం అనర్థమంటూ జులై 26వ తేదీన ఒక పత్రికలో ప్రచురితమైన వార్తా కథనం ఆధారంగా న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను సుమోటో పిల్ గా హైకోర్టు పరిగణించింది. ఈ పిటిషన్పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పల్లెల్లో ప్రభుత్వ వైద్యసేవలు, తగినన్ని ఆసుపత్రులు, వైద్యులు లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో చికిత్స నిమిత్తం రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారంటూ పిటిషన్దారు పేర్కొన్నారు. ఇదే అంశాలపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో జత చేయాలంటూ ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశిస్తూ ఈ పిటిషన్పై తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.