నాకు ఒక్క ఛాన్సివ్వండి, కేసీఆర్తో మాట్లాడతా, హరికృష్ణ శవం పక్కనుండగా: జగన్ విజ్ఞప్తి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పారు. ఈ రోజు కురుక్షేత్రం చివరి రోజు అన్నట్లుగా కనిపిస్తోందని సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి అన్నారు.
నేతలకు అలర్ట్!: మరో ఐదు రోజుల్లో వైసీపీ డోర్లు క్లోజ్, వచ్చినా ఆ హామీ ఉండదా, కారణాలివేనా?
అయిదేళ్ల చంద్రబాబు పాలన చూశామని, ప్రజలను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే పేదవాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. బీసీల సమస్యలు తెలుసుకోవడానికి పార్టీకి చెందిన అధ్యయన కమిటీ కృషి చేసిందని చెప్పారు. పాదయాత్రలో ఉండగానే తాను బీసీ సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో 25 శాతం నిధులతో బీసీలకు ఉప ప్రణాళిక అంటూ చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పుతాడట
బీసీ అంట్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదని, భారత్ కల్చర్ అని జగన్ అన్నారు. భారతీయ సంస్కృతిలో అణువణువు బీసీలే అన్నారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పడానికే ఈ సభ అన్నారు. నేటికీ సమాజంలో బీసీలు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు చెప్పిన బీసీ సబ్ ప్లాన్కు దిక్కులేదు కానీ, కేంద్రంలో చక్రం తిప్పుతాడట అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని నింపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు అవకాశం వస్తుందన్నారు.
కరివేపాకులా వాడుకుంటున్నారు
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు ప్రజల చెవుల్లో పూవులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని చదివించడానికి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని చెప్పారు. ముష్టి వేసినట్లుగా ఫీజు రీయింబర్సుమెంట్ ఇస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రతి కులాన్ని మోసం చేశాడన్నారు. కులాలను మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారన్నారు. చంద్రబాబు ఎంతమంది ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు ఇచ్చారో చెప్పాలన్నారు. అధికారం ఉంది కదా అని చంద్రబాబు బీసీలను కరివేపాకులా వాడుకుంటున్నారన్నారు.
హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకొని, నేను కేసీఆర్తో మాట్లాడుతా
తెలంగాణలో కులాలను బీసీల నుంచి తొలగిస్తే చంద్రబాబు.. కేసీఆర్ వద్ద ప్రస్తావించలేదని జగన్ అన్నారు. నందమూరి హరికృష్ణ మృతదేహాన్ని పక్కన పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో పొత్తు కోసం మాట్లాడుతారని, కానీ బీసీలను తొలగిస్తే మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే కేసీఆర్తో నేను మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో ఉండేలా చేస్తానని చెప్పారు. చంద్రబాబు 2014లో బీసీలకు 119 వాగ్ధానాలు ఇఛ్చారని, వాటిని నెరవేర్చలేదన్నారు. ఇలాంటి చంద్రబాబును ఓడించాలని, వైసీపీకి, తనకు ఒక్కసారి అవకాశమివ్వండని కోరారు. అప్పుడు మార్పు చూడాలన్నారు.