సిఎంకు చేతకాకపోతే నాకు పవర్ ఇవ్వండి...ఇసుక మాఫియా నెలరోజుల్లో అరికడతా:విష్ణుకుమార్ రాజు
అమరావతి:రాష్ట్రంలో ఇసుక మాఫియా రాక్షసంగా తయారయిందని బీజేపీ నేతలు విష్ణుకుమార్ రాజు,సోము వీర్రాజు మండిపడ్డారు. ఇసుక ఫ్రీ విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టినా...రాష్ట్రంలో ఇసుక దోపిడీ యధేచ్చగా జరుగుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఈ ఇరువురు బిజెపి నేతలు మీడియాతో మాట్లాడుతూ ఇసుక మాఫియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుకమాఫియాలో అధికార, ప్రతిపక్షాంతో పాటు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పాత్ర ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సీఎంకు చేతకాకపోతే నాకు అధికారం ఇవ్వండి..నెల రోజుల్లో ఇసుక మాఫియాను అరికడతానని సవాల్ విసిరారు.
అందరికి...వాటాలు
ఇసుకమాఫియాలో అధికార, ప్రతిపక్షానికి వాటాలున్నాయని...అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలకు కూడా ఇందులో పాత్ర ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు బకాసురుల్లా ఇసుకను తినేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదవాళ్లకు ఇసుక అందకుండా చేస్తున్నారని సోము వీర్రాజు విమర్శించారు.
టిడిపికి...ఆదాయ వనరు
రాష్ట్రంలో పేదవాళ్లకు ఇసుకను అందకుండా చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఉచిత ఇసుక పాలసీ రాష్ట్రంలో అమలు కావడం లేదని స్పష్టం చేశారు. ఏపీలో నీతిలేని పరిపాలన నడుస్తోందని, వచ్చే ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కోసమే ఇసుకను తెలుగు దేశం పార్టీ ఆదాయవనరుగా మార్చుకుందని సోమూ వీర్రాజు దుయ్యబట్టారు.
యధేచ్చగా...ఇసుక దోపిడీ
రాష్ట్రంలో ఇసుక ఫ్రీ విధానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఇసుక దోపిడీ యధేచ్చగా జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. బీజేపీకి టిడిపి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇసుక మాఫియాను తాను వ్యతిరేకించానని తెలిపారు. లోడింగ్ ఛార్జీలు పెరగడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉందని, నాలుగేళ్లలో వెయ్యి కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని ఆయన విమర్శించారు.
నెలరోజుల్లో...అరికడతా
రాష్ట్రంలో రోజురోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని విష్ణుకుమార్ రాజు చెప్పారు. విశాఖలో ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు ఆగిపోవడం జరిగిందన్నారు. సీఎంకు చేతకాకపోతే నాకు అధికారం ఇవ్వండి..నెల రోజుల్లో ఇసుక మాఫియాను అరికడతానని ఆయన సవాల్ విసిరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకు రావడం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించండని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడగటంలో న్యాయముందని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని, సమస్యలపై ప్రశ్నించాలని విష్ణుకుమార్ రాజు సూచించారు.