సమాచారం ప్రభుత్వానికి చేరవేస్తారేమో, నేను కోరిన గన్మెన్లనే ఇవ్వండి: వైసీపీలో చేరిన ఆమంచి
ఒంగోలు: కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రవీణ్ను కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని తాను సూచించిన వారిని తనకు గన్మెన్లుగా ఇవ్వాలని కోరారు. అలాగే, చీరాల నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలు, తన కార్యకర్తలపై దాడి విషయాలను ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు.
ఇప్పటి వరకు గన్మెన్లుగా ఉన్న వారిని వెనక్కి తీసుకోవడంపై ఎస్పీతో మాట్లాడారు. గన్మెన్లు తమకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరేవేసే అవకాశముందని, రాజకీయాల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కాబట్టి తాను సూచించిన వారినే తనకు గన్మెన్లుగా నియమించాలని ఎస్పీని కోరారు. తన విజ్ఞప్తికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రెండు రోజుల క్రితం చీరాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లుగా వైసీపీ వర్గీయులు ఆరోపించారు. గ్రామసభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమంచి వర్గీయులపై దాడి చేశారని చెప్పారు. ఈ అంశాన్ని ఆమంచి ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లారు.
కాగా, ఆమంచి వారం క్రితం వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. హైదరాబాదులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.