వెంకయ్య నుంచి బాబు వరకు చేశారు: జగన్ పార్టీపై అమిత్ షా నిప్పులు, హోదాపై..
తాడేపల్లిగూడెం: తాము ఏపీకి హోదాను మించిన ప్యాకేజీ ఇచ్చామని, వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శనివారం నాడు మండిపడ్డారు. ఏపీకి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.
హోదా విషయంలో ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. హోదాకు మించిన సాయాన్ని కేంద్రం రాష్ట్రానికి అందిస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం సాయంత్రం జరిగిన ఉభయ గోదావరి జిల్లాల రైతు సదస్సుకు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో వేల మంది రైతులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రధాని మోడీ నాయకత్వాన ఏది చేసినా రైతుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని చేసిందే అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారన్నారు.
అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మార్కెట్లో ఎక్కడా యూరియా కొరత రాలేదన్నారు. ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చే యూరియా పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారన్నారు. శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులకు మెరుగైన ధర లభించేలా మార్కెట్ యార్డులను ఎక్కడికక్కడ అనుసంధానం చేశారన్నారు.
ఈ-మార్కెటింగ్ విధానం ప్రవేశ పెట్టారన్నారు. ఇదంతా రైతుల శ్రేయస్సు కోసం చేసిందే అన్నారు. ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులను కష్టపెట్టాలన్న ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదన్నారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనేది రైతులను ఇబ్బంది పెట్టేందుకు కాదన్నారు. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ప్రజలు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.
ప్రత్యేక హోదాపై..
ప్రత్యేక హోదాపై కాంగ్రెస్, వైసిపిలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. 14వ ఆర్థిక సంఘం వల్లనే రాష్ట్రానికి హోదా ఇవ్వలేకపోయామని, 14వ ఆర్థిక సంఘం ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
ప్రత్యేక హోదాను మించిన ఆర్థిక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్కు ఇచ్చామని, ఏపీకి పరిశ్రమలు తరలిరావడానికి కావాల్సిన పన్ను మినహాయింపులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రూ.22వేల కోట్ల రాష్ట్ర ఆర్థిక లోటును పూడ్చటానికి కేంద్రం సన్నద్ధంగా ఉందన్నారు.
ఇప్పటి వరకు ఏపీకి లక్షా 40వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామన్నారు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న భూమి చాలా సారవంతమైందని, ఇక్కడి రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందని అమిత్ షా అన్నారు.
వెంకయ్య నుంచి చంద్రబాబు వరకు..
కేంద్రమంత్రి వెంకయ్య దగ్గర నుంచి సీఎం చంద్రబాబు వరకు చేసిన కృషి వల్ల ప్రత్యేక హోదాకు మించి మంచి ప్యాకేజీని ఏపీకి ఇవ్వగలిగామని, పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక లోటు రూ.22 వేల కోట్ల భర్తీకి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
కాంగ్రెస్, వైసీపీలు ఏది మాట్లాడినా హోదాను సాకుగా చూపుతున్నాయన్నారు. కానీ దానికి మించిన సాయం అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీని అగ్రగామిగా నిలబెట్టడమే కాదని, ఇక్కడ బీజేపీని బలోపేతం చేసేలా సహకరించాలని కోరారు.
ప్రధాని దైవ దూత: వెంకయ్య
అవినీతిపై ప్రధాని మోడీ శంఖం పూరించారని, ధర్మ యుద్ధం చేస్తున్నారని, ఈ మహాయజ్ఞానికి సహకరించాలని కేంద్రమంత్రి వెంకయ్య పిలుపిచ్చారు. ప్రధాని మోడీని దైవదూతగా అభివర్ణించారు. నోట్ల రద్దు ఏ ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని చేసింది కాదని, ఈ దేశ ఆర్థిక వికాసానికి చేసింది మాత్రమే అన్నారు.
పేదలు, రైతులు మోడీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని సమర్థిస్తున్నారన్నాపు, ప్రతిపక్షాలు ధైర్యంగా చెప్పలేకపోతున్నాయని, మంచిదే కానీ అంటూ ఆగిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇదేం పద్ధతి అని నిలదీశారు. గడచిన రెండున్నరేళ్లుగా మోడీ పాలనలో ఏ ఒక్క కుంభకోణం జరగలేదన్నారు.