రాజధానిగా విశాఖ .. ప్రతికూలతలు చెప్పిన జీఎన్ రావు కమిటీ నివేదిక .. వెలుగులోకి సంచలన విషయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రగడ ఇంకా కొనసాగుతుంది. మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదించకున్నా,మండలి రద్దు దాకా తాజా పరిణామాలు మారినా వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా మార్చటానికి ఒకపక్క సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే బాగుంటుంది అని చేసిన ప్రకటన రేపిన దుమారం ఇంకా కొనసాగుతుంది. ఇక రాజధాని ఏర్పాటు కోసం మొదట వేసిన జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక రాజధానిగా వైజాగ్ వద్దని చెప్పిందన్న అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉగాది నుండి ఏపీలో విశాఖ వేదికగా పాలన ... వైసీపీ సర్కార్ తాజా వ్యూహం ఇదేనా ?
విశాఖ రాజధానిగా ఉన్న ప్రతికూలతలను నివేదికలో ఇచ్చిన జీఎన్ రావు కమిటీ
ఈ నేపధ్యంలో అసలు జీఎన్ రావు కమిటీ వైజాగ్ గురించి నివేదికలో ఇచ్చిన అంశాలపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతుంది. విశాఖను పరిపాలనా రాజధానిగా పేర్కొన్నట్లుగా జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక చెప్పినట్లుగా వివరాలు మాత్రమే అప్పుడు బయటకు వచ్చాయి. అయితే.. ఈ నివేదికకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేయటానికి ఉన్న సానుకూలతల్ని ప్రస్తావించిన జీఎన్ రావు కమిటీ విశాఖకు ఉన్న ప్రతికూలతల్ని కూడా పక్కాగా పేర్కొనటం గమనార్హం.
విశాఖ సాగర తీరం కాబట్టి, తుఫానుల బెడద ఎక్కువన్న కమిటీ
జీఎన్ రావ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖ సాగర తీరం కాబట్టి, తుఫానుల బెడద ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని సముద్రానికి వీలైనంత దూరంలో రాజధాని ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ పేర్కొనట్టు తెలుస్తుంది . విశాఖలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం , నీటి కాలుష్య సమస్యల్ని ప్రస్తావించటంతో పాటు విశాఖలో తగినంత భూమి అందుబాటులో లేకపోవటాన్ని ప్రస్తావించింది జీఎన్ రావు కమిటీ . ఇక విశాఖకు తుపాన్ల ముప్పుతో పాటు కోస్టర్ రెగ్యులేటరీ జోన్ పరిమితులు ఉన్నాయని పేర్కొంది. తీరం కోతకు గురి కావటం లాంటి సమస్యల్ని ప్రస్తావించింది జీఎన్ రావు కమిటీ .
విశాఖలో పారిశ్రామిక కాలుష్యం , నీటి కాలుష్యం, గాలి క్షీణత సమస్యలు
విశాఖలో సముద్రం కారణంగా భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారటం కూడా ఒక ఇబ్బంది అని పేర్కొంది. ఉక్కు కర్మాగారం, పోర్టు సంబధిత కార్యకలాపాల కారణంగా పారిశ్రామిక కాలుష్య సమస్యలు బాగా ఉన్న చోట రాజధాని ఏర్పాటు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది . జోన్ 1లో వచ్చే విశాఖలో భారీ పరిశ్రమలు, పోర్టులు ఉన్నందున గాలి నాణ్యత క్షీణిస్తోందని పేర్కొంది . తూర్పు నౌకాదళ కేంద్రం ఉన్న నేపథ్యంలో అణు జలాంతర్గాములకు ఇది కేంద్రం కావటంతో భద్రతా పరమైన సమస్యలున్నట్లుగా పేర్కొంది. ఇక్కడున్న పరిమితుల కారణంగా కొత్తగా పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభించటం అంత మంచిది కాదని జీఎన్ రావు కమిటీ నివేదిక వెల్లడించింది .
తుఫాను ప్రభావిత ప్రాంతం.. రాజధాని ఏర్పాటుకు ప్రతికూలత
రాష్ట్రంలోని తీర ప్రాంతానికి తుపానులు, పెను గాలులు, సునామీలతో ప్రమాదం పొంచి ఉందని, 1971 నుండి 2018 వరకు 70 శాతం తుఫాన్లు ఉత్తరాంధ్రలో సముద్ర తీరం దాటిన రికార్డులు ఉన్నాయని పేర్కొంది . వాతావరణ మార్పుల కారణంగా భవిష్యత్తులో ఈ ప్రమాదం మరింత పెరిగే వీలుంది. ప్రతి రెండేళ్లలో ఒక తీవ్రమైన తుపాను ఏపీని తాకటంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోందని అలాంటి తుఫానుల ప్రభావం బాగా ఉండే చోట రాజధాని ఏర్పాటు మంచిది కాదనే భావన వచ్చేలా రిపోర్ట్ ఇచ్చింది .
వైజాగ్ ఏ రకంగానూ సేఫ్ కాదని జీఎన్ రావు కమిటీ నివేదిక
జిఎన్ రావు కమిటీ నివేదిక మరియు బోస్టన్ కమిటీ నివేదిక , అలాగే హైపవర్ కమిటీ నివేదికలన్నీ విశాఖపట్నం రాజధానికి ఉత్తమమైన ప్రదేశమని సూచించాయని మాత్రమే బయటకు వచ్చింది. అయితే సముద్ర తీర ప్రాంతం అయిన వైజాగ్ ఏ రకంగానూ సేఫ్ కాదని రాజధాని సాధ్యమైనంత దూరంగా ఏర్పాటు చెయ్యాలని అన్ని ప్రతికూలతలు సమగ్రంగా నివేదికలో ఇచ్చింది జీఎన్ రావు కమిటీ. తాజాగా ఈ సంచలన విషయాలు వెలుగులోకి రావటంతో ఏపీ ప్రజలు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుపుతున్నారు.