కేఈ కృష్ణమూర్తికి షాక్: రెవెన్యూ బదిలీలు, నియామకాలు జీఏడీకి బదలాయింపు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తికి బుధవారం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొంతమంది అధికారుల బదిలీలు, నియామకాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ)కి బదలాయించింది
విజయవాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయిన కె.ఇ.కృష్ణమూర్తికి బుధవారం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కొంతమంది అధికారుల బదిలీలు, నియామకాలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ (జీఏడీ)కి బదలాయించింది. చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు రెవెన్యూ మంత్రి, లేదా ఉప ముఖ్యమంత్రి(రెవెన్యూ) పరిధిలో ఉన్న ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకం, పోస్టింగ్ లను జీఏడీ విభాగానికి బదిలీ చేస్తూ జీవో నెంబరు 28 జారీ అయింది.
సెక్రటేరియట్ విభాగాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తిగా రెవెన్యూ పరిధిలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల నియామకాలు, బదిలీలను జీఏడీకి బదిలీ చేశారు.
అయితే జీవోలో పేర్కొన్న అధికారుల బదీలీలు జిఎడి పరిధిలోకి చేర్చినా, సర్వీస్ రిజిస్టర్ నిర్వహణ మాత్రం రెవెన్యూ పరిధిలోనే ఉంటుంది. వికేంద్రీకరణ పేరుతో అధికారాలన్నీ జీఏడీ లేదా సీఎంఓ పరిధిలో కేంద్రీకృతం చేస్తున్నారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా రెవెన్యూ శాఖపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు.