ఈనెల 28న కరువు బంద్: 6న మోదీ గో బ్యాక్..!
వామపక్ష పార్టీలు తమ కార్యాచరణ ప్రకటించాయి. ఏపిలో ఉన్న కరువు ను దృష్టిలో ఉంచుకొని ఈనెల 28న ఏపి లో కరువు బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష పార్టీల కార్యాచరణ నిర్ణయించింది. అదే విధంగా..ఏపి కి వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ జనవరి 6న గో బ్యాక్ మోదీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు..
ఏపిలో వామపక్ష పార్టీలు పోరాట కార్యాచరణను ప్రకటించాయి. తొమ్మది వామపక్ష పార్టీల కార్యాచరణ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో తుఫాన్, కరువుతో జనాలు అల్లాడుతున్నారని, ప్రభుత్వం కరువు ప్రాంతాల వారికి సాయం ప్రకటించడం లేదని సమావేశం ప్రకటించింది. సమావేశం లో తీసుకున్న నిర్ణయాల మేరకు డిసెంబర్ 28 న కరువు బంద్ నిర్వహించనున్నారు. అదే విధంగా..ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయాలని నిర్ణయించారు. నవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా, 6న గుంటూరులో మోదీ గో బాక్ అంటూ నినాదాలతో నిరసన తెలియ చేస్తామని వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఇందు కోసం అన్ని జిల్లాల్లోనూ కార్యాచరణ సిద్దం అవుతుందన్నారు.
ఇక, ఇదే సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ పైనా చర్చ జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..హోదా పై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. జనవరి 4న ఢిల్లీ కేంద్రంగా ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియచేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఈ నెల 27న వైసిపి ఢిల్లీలోని జంతర్ మంతర్ లో వంచన పై గర్జన నిర్వ హిస్తోంది. ఇదే సమయంలో టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పుడు వామపక్ష పార్టీలు సైతం హోదా కోరుతూ ఢిల్లీ బాట పడుతున్నారు.