ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష..రవాణా ఖర్చెంతో తెలుసా? మరీ అంత తక్కువా?
అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దేశ రాజధాని న్యూఢిల్లీలో ధర్మపోరాట దీక్ష పేరుతో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ సహా పలువురు మంత్రులు, ఆ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులూ ఇందులో పాల్గొన్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా ఈ దీక్షకు మద్దతు తెలిపారు. బీజేపీయేతర పార్టీలకు చెందిన నాయకులూ ఇందులో భాగస్వామ్యులయ్యారు. ధర్మపోరాట దీక్ష చేస్తోన్న ప్రాంతం నల్లబారింది. చంద్రబాబు, లోకేష్ సహా అందరూ నల్లచొక్కాలను వేసుకుని నిరసన తెలియజేస్తుండటంతో.. ఈ ప్రాంతం మొత్తం నల్లమయమైంది.
మొన్నటిదాకా ధర్మ పోరాట దీక్ష రాష్ట్రానికే పరిమితమై ఉండేది. తరచూ ఏదో ఒక జిల్లాను ఎంచుకుని అక్కడ ఈ దీక్ష శిబిరాన్ని వేసేవారు. మొదటి సారిగా దేశ రాజధానికి చేరింది. ఇదివరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహించిన యునైటెడ్ ఇండియా ర్యాలీని చూసి చంద్రబాబు స్ఫూర్తి పొందారేమో గానీ.. తాను కూడా అదే రేంజిలో చెలరేగిపోయారు. తన చేతిలో ఉన్న ధర్మపోరాట దీక్ష ఈ సారి ఏకంగా ఢిల్లీకే తరలించారు. ఢిల్లీలో దీక్షలంటే మాటలు కాదు. రాష్ట్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ రాజధాని వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించాలంటే ఖర్చుతో కూడుకున్న పని.
అయినప్పటికీ.. తెలుగుదేశం ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. జిల్లా స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలను రైళ్లల్లో తరలిస్తే.. వీఐపీలుగా చెప్పుకొనే మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర కీలక నేతలు విమానాలు ఎక్కారు. ధర్మ పోరాట దీక్ష అనేది పక్కా రాజకీయపరమైన అంశం. దీనికి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొన్నప్పటికీ.. అదేమీ ప్రభుత్వ కార్యక్రమం అసలే కాదు. ఈ దీక్షలో పాల్గొని, నల్లచొక్కాలను ధరించి, నిరసనలను తెలియజేయటానికి సరిపడేలా జనాన్ని తీసుకెళ్లడానికి అవసరమైన ఖర్చును భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదు.
ఎంత తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులైనా గానీ.. సొంత జేబు నుంచి ఖర్చు పెట్టుకుని ఢిల్లీ దాకా వెళ్లలేరు. అలాంటి వారి కోసం ఏర్పాటు చేసిన రైళ్లు, విమానాల ఖర్చును భరించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే. ఢిల్లీలో దీక్షకు దిగడానికి చూపిన ఉత్సాహాన్ని ఖర్చు పెట్టడంలో చూపలేదు టీడీపీ. అందుకే- ప్రభుత్వ ఖజానా నుంచి దీనికైన ఖర్చును విడుదల చేయించింది. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షను నిర్వహించడానికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. ఈ ఖర్చు మొత్తం.. 1,12,16,465 రూపాయలు. ఇదంతా ఒకరోజు ఖర్చు మాత్రమే.
ఈ మొత్తంలో శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి తరలిన రైళ్ల కోసం వరుసగా 59,49,380, 42,67,085 రూపాయలను భరిస్తూ, ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రొటోకాల్ డిప్యూటీ డైరెక్టర్ పేరు మీద జీవో విడుదల చేసింది. మరో 10 లక్షల రూపాయలను బోగీ డిపాజిట్ గా చెల్లించారు. రెండు రైళ్లను సమకూర్చినందుకు ఈ మొత్తాన్ని ఐఆర్ సీటీసీ తన ఖాతాలో జమ చేసుకుంటుంది. ఈ వ్యయం కేవలం ఈ రెండు జిల్లాల నుంచి తరలించిన రైళ్ల కోసమే. రైళ్లలోనే కాకుండా, విమానాల ద్వారా కూడా పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు ఢిల్లీ వెళ్లారు. విమానాల ద్వారా తరలించడానికి అయిన ఖర్చును ఈ జీవోలో పొందు పరచలేదు.
రైళ్లు, విమానాల ద్వారా రాకపోకలు సహా, హోటల్లలో వారికి నివాస వసతి కల్పించడానికి, భోజనాల వ్యయం, దీక్షకు ఉపయోగించిన సామాగ్రి ఖర్చు మొత్తం తడిసి, అనధికారికంగా.. కనీసం 12 కోట్ల రూపాయలు వ్యయం అయి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా త్వరలో కొత్త జీవోలు వచ్చినా ఆశ్యర్యపోనక్కర్లేదు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తే.. చంద్రబాబు ఏ రేంజ్ లో ఖర్చు పెడతారో మనకు తెలియనిది కాదు. ఇదివరకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారం కోసం బెంగళూరుకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడున్న కొన్ని గంటల కోసం ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలను వ్యయం చేశారు. దీన్ని ప్రభుత్వమే భరించింది.