అగ్రిగోల్డ్ చెక్కుల పంపిణీ: బడ్జెట్ చాలట్లేదు: రూ.86 కోట్లు ఎక్కడి నుంచి
అమరావతి: రాష్ట్రాన్ని కుదిపేసిన అగ్రగోల్డ్ కుంభకోణం వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. చర్చనీయాంశమైంది. 10 వేల లోపు మొత్తాన్ని అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా వచ్చేనెలలో బాధితులకు చెక్కులను పంపిణీ చేయడానికి ప్రభుత్వ యంత్రాగం ఏర్పాట్లు చేస్తోంది. అక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దీనికి చాలినంత బడ్జెట్ ను కేటాయించకపోవడం అనుమానాలను రేకెత్తిస్తోంది. అగ్రిగోల్డ్ మొత్తం డిపాజిటర్లలో 10 వేల రూపాయల లోపు మొత్తాన్ని డిపాజిట్ చేసిన వారి సంఖ్య 6,49,179 మంది ఉన్నట్లు తేలింది.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పూర్తి స్థాయిలో సర్వే చేసిన తరువాత స్వయంగా సీఐడీ అధికారులు నిర్ధారించిన సంఖ్య ఇది. వారు చేసుకున్న క్లెయిమ్ లు మరింత అధికంగా ఉన్నాయి. మొత్తం క్లెయిమ్లు 6,96,171గా తేలాయి. వారందరికీ చెక్కులను అందజేయాలంటే ప్రభుత్వానికి 336.20 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఆ స్థాయిలో లేవు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ మొత్తం 251 కోట్ల రూపాయలు. అంటే వాస్తవ లెక్కలకు, ప్రభుత్వం కేటాయించిన మొత్తానికి ఉన్న తేడా 86 కోట్ల రూపాయలు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఇంత పెద్ద మొత్తాన్ని ఎక్కడి నుంచి ప్రభుత్వం తీసుకొస్తుందనేది వాదనలు ఉన్నాయి. ఏవైనా పథకాలకు కోత పెట్టి, వాటికి కేటాయించిన నిధులను మళ్లించే అవకాశం కూడా లేకపోలేదని సమాచారం.
అగ్రిగోల్డ్ బాధితుల లెక్కలను తీయడానికి లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఐడీ అధికారులు, జిల్లాల ఎస్పీలతో కలిసి 10 వేల రూపాయల లోపు బాండ్లు ఉన్న డిపాజిటర్లను పిలిచి, వారి వద్ద రశీదులు, బాండ్లను పరిశీలించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను జిల్లా సీఐడీ అధికారులు, ఎస్పీలకు అప్పగించారు. ఈ నెలాఖరులోగా 10 వేల రూపాయలు కట్టిన డిపాజిటర్ల సంఖ్యను నిర్ధారించగలిగితే వారికి చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు డిపాజిటర్లు తాము.. అగ్రిగోల్డ్ వద్ద 10 వేల రూపాయలను చెల్లించినట్లు చెబుతున్నప్పటికీ.. దాన్ని రుజువు చేయడానికి వారి వద్ద సరైన ఆధారాలు లేవు. అగ్రిగోల్డ్ ఇచ్చిన బాండ్లు గానీ, రశీదులు గానీ లేవు. అలాంటి వారికి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
1995లో విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ ఏర్పాటైంది. దక్షిణాది రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి 6,380 కోట్ల రూపాయలను డిపాజిట్ రూపంలో సేకరించిందా సంస్థ. 2014లో వేలాది మంది డిపాజిటర్లకు సంస్థ ఇచ్చిన చెక్కులు బ్యాంకుల్లో చెల్లబాటు కాలేదు. బాధితులు పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసింది. చైర్మన్ అవ్వారు వెంకట రామారావుతోపాటు 20 మంది డైరెక్టర్లను అరెస్టు చేసింది.
హైకోర్టు ఆదేశాల మేరకు జప్తు చేసిన ఆస్తుల వేలం ప్రక్రియ మొదలు పెట్టారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతుండంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం 10 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారికి ఆ మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన జిల్లా కమిటీల ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెల్లింపుల పూర్తి వివరాలు జిల్లాల వారీగా సీఐడీ సిద్ధం చేసింది.