రాజధాని రైతులకు రఘురామ భరోసా: దేవుడు మనవైపే ఉన్నాడు, విశాఖకు రాజధాని తరలింపు వాయిదాపై..
అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేయండి కానీ ఆందోళన పడొద్దని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్ద బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన అంశానికి సంబంధించి హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. దీనిని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా మంగళవారం కూడా విచారణకు రాలేదని.. అయినా రాజధాని రైతులకు న్యాయం జరుగుతోందన్నారు. 16వ తేదీన రాజధాని తరలించే అంశానికి సంబంధించి ప్రభుత్వమే వెనకడుగు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాజధాని రైతులకు న్యాయం జరుగుతోందని.. మీ వెంట ఉంటానని భరోసానిచ్చారు.
దేవుడు మనవైపు ఉన్నాడు..
దేవుడు మన వైపు ఉన్నాడని.. అందుకే 16వ తేదీన విశాఖలో జరగాల్సిన శంకుస్థాపన వాయిదా పడిందని రఘురామ గుర్తుచేశారు. దీనికి సంబంధించి రిటైర్డ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ చెప్పిన అంశాలను ఉదహరించారు. 14 ఆర్డికల్ ప్రకారం న్యాయం అందరికీ సమానం అని తెలిపారు. ప్రత్యేక హక్కులు అమల్లోకి వచ్చినందున.. దానిని తీసేయడం వీలులేదని చెప్పారు. న్యాయం మీ పక్షాన ఉంది అని.. గాంధేయ మార్గంలో ఆందోళన చేయాలని రైతులను కోరారు. ఆందోళన చెందొద్దు అని.. ఆందోళన చేయాలని పేర్కొన్నారు.
సెక్షన్ 6 ప్రకారం..
విభజన చట్టం ప్రకారం సెక్షన్ 6 కింద రాజధాని కోసం కమిటీ నియమించారని రఘురామ గుర్తుచేశారు. కమిటీ 6 నెలల్లో నివేదిక అందజేసిందని.. అసెంబ్లీలో చట్టంగా కూడా మారిందని తెలిపారు. ఆ చట్టానికి సవరణలు ఉంటే మూడేళ్లలో మార్పులు చేయాలని సూచించారు. కానీ ఐదేళ్ల తర్వాత సీఆర్డీఏ బిల్లు రద్దు చేస్తామని చెప్పడం న్యాయ విరుద్దం అని పేర్కొన్నారు. దీనిని రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు అంగీకరిస్తున్నారని.. వాస్తవాన్ని తెలియజేస్తున్నారని తెలిపారు.
అమరావతి రైతులే కాదు.. విశాఖ వాసులు కూడా..
రాజధాని తరలింపునకు అమరావతి రైతులు, విశాఖ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని రఘురామ తెలిపారు. ప్రజల మనసు ఎరిగి పాలించాలే కానీ.. గాయపరచి కాదు అని జగన్ ప్రభుత్వానికి సూచించారు. 3 రాజధానులు అని చెప్పి.. క్యాపిటల్ సిటీ విశాఖకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది అందరికీ అర్థమవుతోందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి కూడా ఒక్క లక్నో రాజధాని ఉంది అని... ఏపీకి మూడు రాజధానులు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీజేపీ నేత రాం మాధవ్ తెలిపిన అంశాన్ని ప్రస్తావించారు.
Recommended Video
రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టాన్నీ.. మళ్లీ
రిటైర్డ్ అయిన వారికి పెన్షన్ ఇవ్వాలని.. వారు ఇబ్బందులు పడుతున్నారని రఘురామ తెలిపారు. 10 రోజులయిన పెన్షన్ ఇవ్వకుంటే వారిలో టెన్షన్ వస్తుందన్నారు. జీఎస్టీ ఫండ్స్, నిధుల కొరత వల్ల పరిస్థితి వచ్చి ఉంటుందని..కానీ పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇన్నీ సమస్యలు ఉంటే.. రాజధాని తరలింపు కోసం పాటుపడటం సరికాదన్నారు. రాష్ట్రపతి ఆమోదించిన బిల్లు చట్టంగా మారిందన్నారు. కానీ గవర్నర్ పేరుతో రాజధాని మార్పు చేపట్టడం మంచి పద్దతి కాదన్నారు. దీంతో రాజధాని రైతులు చనిపోతున్నారని ఆందోళన చెందారు.