సుడిగుండాలే యమ గండాలయ్యాయి ... కన్నీటి సుడులే మిగిలాయి .. విషాదంలో తెలుగు రాష్ట్రాలు
సుడిగుండాలు యమగండాలయ్యాయి. మృత్యు హేల మోగించి కన్నీటి సుడులను మిగిల్చాయి. గోదావరి నదిలో సరదాగా షికారు కి వెళ్లిన కుటుంబాలను బలి తీసుకున్న లాంచీ ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రం లోకి నెట్టింది. తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచింది.
ఆహ్లాదం కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి .. విషాదంలో తెలుగు రాష్ట్రాలు
గోదావరమ్మ చెంత ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, గోదావరి నది లో బోటు షికారు చెయ్యాలని, ఇటీవల వరదలకు పోటెత్తుతున్న గోదావరమ్మ సోయగాలు చూడాలని వెళ్లిన పర్యాటకులు మృత్యుకుహరంలోకి వెళుతున్నట్లు ఊహించలేకపోయారు. రెప్పపాటులో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు. కచ్చులూరు వద్దకు ఏ బోటు వెళ్లినా ప్రమాదపుటంచుల వరకూ వెళుతుంది. తేడా వస్తే మునిగిపోవడం ఖాయం అనే విషయం అక్కడ లాంచీలు నిర్వహిస్తున్నఅందరికీ తెలిసినా , అందరికీ జాగ్రత్త అని చెప్పినా , ఊహించని పరిణామం లాంచీని ముంచేసింది.
కచ్చులూరు డేంజర్ జోన్ అని బోటు నడిపే వారికి తెలిసినా ప్రమాదం
పదుల సంఖ్యలో ప్రాణాలను గోదావరిలో కలిపేసిన విషాదం ప్రతి ఒక్కరి మనసులను కలచివేస్తుంది. గోదావరిలో అత్యంత భయంకర భయానక ప్రదేశంగా కచ్చులూరు వద్ద గోదావరిని స్థానిక మత్య్సకారులు, అక్కడ బోట్లను నిర్వహించేవారు పేర్కొంటారు. అలాంటి ప్రమాదకరమైన ప్రదేశం లో చోటు చేసుకున్న మరో పడవ ప్రమాదం తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచేసింది. 73 మందితో పాపికొండలకు వెళ్లినరాయల్ పున్నమి బోటు ఆదివారం గండి పోచమ్మ ఆలయం నుంచి బయలుదేరినకొద్దిసేపటికే గోదావరిలో మునిగిపోయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బోటు నడిపే వారికి అది డేంజర్ జోన్ అని తెలిసినా ఊహించని విధంగా ప్రమాదం జరిగింది .
సుడిగుండాలే ప్రమాదానికి కారణం అయ్యి ఉంటుందంటున్న మత్స్య కారులు
కచ్చులూరులో గోదావరిలో ప్రస్తుతం 80 అడుగుల లోతులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువున పడ్డ వర్షాలతో దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం గోదావరిలో ఉంది.కచ్చలూరు గోదావరిలో ఎక్కువగా సుడిగుండాలు వస్తుంటాయి. వాటి ధాటికి పడవలు నిలవలేవని, జాగ్రత్తగా లేకుంటే అంతే సంగతి అని అక్కడ లాంచీలు నడిపే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సుడిగుండాలే ఇంతమంది పాలిట యమగండాలు అయ్యాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
1964లో అక్కడ జరిగిన బోటు ప్రమాదం .. అతి పెద్ద ప్రమాదం
గతంలో కూడా కచ్చులూరు ప్రాంతంలో జరిగిన గోదావరి ప్రమాదాల్లో సుడిగుండాల వల్లనే ప్రమాదాలు జరిగినట్లుగా పేర్కొన్నారు. 1964లో కచ్చులూరులో ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగి 60 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తర్వాత ఝాన్సీ రాణి అనే బోటు మునిగి ఎనిమిది మంది మృతి చెందారు. ఈ రెండు ఘటనలు సుడిగుండాల కారణంగా, కచ్చులూరు లోనే జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇక గోదావరి పడవ ప్రమాదాల్లో 1964లో జరిగిన ప్రమాదమే ఇప్పటివరకు అత్యంత విషాదకరమైనది.
ప్రభుత్వం దృష్టి సారించాలి... పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఉదయ భాస్కర్ బోటు మునక ఘటన తరువాత నిన్న జరిగిన ప్రమాదం అంతే తీవ్రమైన పెద్ద ఘటనగా తెలుస్తుంది .
ఏది ఏమైనా వరుసగా జరిగిన ప్రమాదాలన్నీ కచ్చులూరు సమీపంలోనే జరగడం గమనార్హం. గోదావరి నది లోనూ ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి ఆ ప్రాంతానికి పడవలను నడపకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఎంతైనా ఉంది. ప్రమాదపు అంచుల్లో ప్రయాణం సాగించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం పర్యాటకులపైనా ఉంది. తాజా ఉదంతంతో అయినా ప్రభుత్వాలు మేల్కోవాలి . గోదావరి పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలి .