గోదావరి కోళ్లతో "ఢీ"కి...పాకిస్తాన్ పందెం కోళ్లు రెఢీ...
కాకినాడ: క్రికెట్ మ్యాచ్ లో ఇండియా,పాకిస్తాన్ తలపడుతుంటే ఆ కిక్కే వేరు. భారత్ గెలుపు కోసం అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు...ఇప్పుడు అలాంటి ఉత్కంఠ కోళ్ల పందాల్లోనూ పొందొచ్చు...అదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ చదవాల్సిందే...
సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు...వారం రోజుల పాటు ఇంటింటా సందడే సందడి. అయితే గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే ఈ జాబితాలో మరొకటి కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే.... ఆ మరొకటే కోడి పందాలు....కోనసీమలో సంక్రాంతికి కోడిపందాల సందడి అంతాయింతా కాదు. అయితే ఈసారి గోదావరి జిల్లాల్లో కోడిపందాలు మరింత స్పెషల్ ఎట్రాక్షన్ గా మారనున్నాయి. కారణం ఏమిటంటే...ఈ సారి కోడి పందాల బరిలో గోదావరి కోళ్లతో పాకిస్తాన్ పందెం కోళ్లు పోటీ పడనుండటమే...నమ్మశక్యంగా లేదా...కానీ ఇది నిజం...అదెలాగంటే...
గోదావరి కోళ్లతో...పాకిస్తాన్ కోళ్ల ఢీ...
సంక్రాంతి సమీపిస్తుండటంతో గోదావరి జిల్లాల్లో కోడి పందేల సమారానికి సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి సంక్రాంతికి కోడిపందేల్లో స్పెషల్ ఏమిటంటే...గోదావరి కోళ్లతో పాకిస్తాన్ కోళ్లు తలపడనుండటమే...కోడి పందాల్లో...పాకిస్తాన్ కోళ్లా...ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఇందులో అబద్దం గాని అతిశయోక్తి గాని ఏమీ లేవండి..అక్షరాలా ఇది నిజం.
పాకిస్తాన్ కోళ్ల సంగతేంటంటే...
ఇంతకీ ఈ పాకిస్తాన్ కోళ్ల సంగతేంటి? చివరకు మనం సరదాగా ఆడుకునే కోడిపందాల్లోనూ పాకిస్తాన్ పోటీకి రావడమేంటీ అనుకుంటున్నారు కదా...అసలు విషయమేంటంటే...ఈ కోడి పందాలు ఈనాటివి కాదని....వేల సంవత్సరాల క్రితం నుంచి వివిధ దేశాల్లో సాగుతున్న ఈ పోటీలు సాగుతున్నాయనే విషయం మనం గుర్తుచేసుకోవాలి. అయితే క్రికెట్ లాగానే ఈ కోడి పందాల్లో కూడా పాకిస్తాన్ కోళ్లకు మంచి క్రేజ్ ఉంది. అవి పందెంలో యమా పొగరుగా తలపడతాయంట. అందుకే మన గోదావరివాసులు ఈ కోడిపందేలు రసవత్తరంగా సాగటానికి అక్కడ్నుంచి అంటే...పాకిస్తాన్ నుంచే కాదు...తైవాన్, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి కూడా ప్రత్యేకంగా బ్రీడ్ తెప్పించి పెంచుతున్నారట. ముఖ్యంగా కత్తులు కట్టకుండా వేసే పందాల్లో పాకిస్థాన్ బ్రీడ్ కోళ్లు పౌరుషంగా తలపడే తీరు చూసితీరాల్సిందేనట.
కోడి పందాల చరిత్ర....
మరొక్కసారి ఈ కోడి పందాల చరిత్ర గురించి తెలుసుకుంటే ఈ పందేలు మహా అయితే ఏ వందేళ్లో లేక 2 వందల ఏళ్ల నుంచో ప్రారంభమయి ఉంటాయని అనుకోవచ్చు....ఆరువేల సంవత్సరాల క్రితం నుంచే అనేక దేశాల్లో ఈ కోడి పందాలు జరిగేవనడానికి చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి. ఉదాహరణకు 1646లో జార్జి విల్సన్ అనే రచయిత కాక్ ఆఫ్ ది గేమ్ అనే పుస్తకంలో కోడి పందేల గురించి ప్రస్తావించడం గమనార్హం. అమెరికా, జపాన్, ఇరాన్, ఇండోనేషియా, బ్రెజిల్, పెరు, ఫిలపైన్స్, మెక్సికో, ఫ్రాన్స్, క్యూబా, పాకిస్తాన్ మొదలైన దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోడి పందేలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉండటం గమనించాల్సిన విషయం. ఇక మన దేశంలోని వివిధ ప్రాంతాల్లోను, పొరుగురాష్ట్రం తమిళనాడులోను కోడి పందేలకు ప్రత్యేక టోర్నమెంట్లే నిర్వహిస్తుంటారు. అంతెందుకు మన ఆంధ్రాలో పల్నాటి యుద్దానికి దారితీసింది ఈ కోడి పందాలే అనే విషయం మనందరికి తెలిసిన విషయమే...
పందేల విషయంలో...వెనక్కి తగ్గేదేలేదు...
ఈ కోడి పందాలను నిరోధించాలని...కోర్టులు, ప్రభుత్వం, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వీళ్లు వెనక్కి తగ్గరు. ఎలాగైనా ఈ పోటీలు జరిగేలా చూడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు....పొరుగురాష్ట్రం తమిళనాడు లాంటి వాటిల్లో కోడి పందేలకు ప్రత్యేక టోర్నమెంట్లే ఉంటాయని, జల్లి కట్టు విషయంలో వారి ఐక్యతే మనకు స్ఫూర్తిదాయకమని వాదిస్తారు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి ఆంక్షలు ఉంటాయంటూ ఆవేశపడతారు.
కోడిపందాలు...పందేలు కాయడం
కోడి పందేల పై పందాలు కాయడం ఈనాడు కొత్తగా మొదలైంది కాదు మధ్య యుగాల నాటి నుంచే ఈ కోడి పందేలు చూస్తూ ఎంజాయ్ చేయడమే కాదు...గెలుపోటములపై పందేలు కాసేవారు...చివరకు రాజ్యాలు కూడా ఫణంగా పెట్టేవారు. అయితే ఇప్పుడు రాజ్యాలు లేకపోయినా.. కోడిపందేలపై బెట్టింగుల జోరు మాత్రం ఓ రేంజ్కి పెరిగిపోయింది. ఒకప్పుడు వేల రూపాయల పందెం మంటే గొప్పగా చెప్పుకుంటే ఇప్పుడు కోట్ల రూపాయల్లో డబ్బులు అవలీలగా చేతులు మారుతున్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే గతేడాది వంద కోట్ల రూపాయలకు పైగా సొమ్ములు చేతులు మారాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోనూ అంతకుమించే కానీ లెక్క తగ్గేదేమీ లేదు.
పందెంలో ...పుంజుల మాంసానికి
పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈలెక్క పెరిగిందే కానీ తగ్గలేదు. ఇక పందెంలో వీర మరణం పొందిన పుంజుల .. మాంసానికి చాలా డిమాండ్. వాటిని పెంచడానికి అత్యంత బలమైన ఆహారం...ఒక్కో కోడికి వేల రూపాయల నుంచి లక్షలు ఖర్చు చేసి ఖరీదైన, బలమైన తిండి పెడతారు. వాటికోసం ప్రత్యేక ట్రైనర్లు కూడా ఉంటారు. అందుకే ఆ మాంసం రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పందెంలో ఓడిన కోడిని దక్కించుకునేందుకు ఏకంగా వేలం పాటలు జరుగుతాయి. పైగా సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో పందెంకోళ్ల మాంసం తప్ప..బ్రాయిలర్, మామూలు కోళ్ల మాంసం తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. అంతేకాదండోయ్...ఇలా పందెంకోడిని బంధుమిత్రులకు వండిపెట్టడం గొప్పగా భావిస్తారు...ఇదండీ గోదావరి కోళ్లతో పాకిస్తాన్ పందెం కోళ్ల పోటీ వెనుక కథ...