అక్కడ గెలిస్తేనే అధికారం.. ఆ రెండు జిల్లాల్లో పవర్ పంచ్ ఎవరికి తగిలింది ? టెన్షన్లో టీడీపీ, వైసిపి
ఏపిలో అధికారం దక్కాలంటే అక్కడ ఖచ్చితంగా గెలవాల్సిందే. అక్కడ సమీకరణాలు జనసేనకు సానుకూలం. 2014 ఎన్నికల్లో టిడిపి సత్తా చాటింది. ఇక, ఈసారి కొత్త తరహా ఎలక్షన్ ప్లాన్తో వైసిపి అక్కడ వ్యూహాలు అమలు చేసింది. ఇక, ఆ రెండు జిల్లాల్లో పవర్ పంచ్ ఎవరికి తగిలింది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్ల పైనే ఇప్పుడు పార్టీలతో పాటుగా..సర్వే సంస్థలు ఓటరు నాడి పట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూడు పార్టీలకు కీలకమే..
ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 సీట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం సీట్లను టిడిపి క్లీన్ స్వీప్ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో 13 సీట్లు దక్కించుకుంది. అవే..టిడిపికి అధికారం దక్కటంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో..ఇక్కడ పట్టు నిలుపుకోవటానికి టిడిపి చేయని ప్రయత్నం లేదు. సామజిక వర్గాల పరంగా జనసేన తొలి నుండి ఇక్కడ బలంగా కనిపించింది. ఇక్కడ చాలామంది జనసేన నుండి పోటీకి ఆసక్తి చూపారు. ఇక, వైసిపి సైతం ఇక్కడ కొత్త వ్యూహాలు అమలు చేసింది. ఈ సారి ఎన్నికల్లో పోలింగ్ సరళి చూసిన తరువాత జనసేనకు భారీ స్థాయిలో ఓట్లు పోలయినట్లు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ గోదావరిలో నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఏలూరు నియోజకవర్గాల్లో జనసేన గెలుపు పైన భారీ అంచనాలు పెట్టుకుంది. వీటితో పాటుగా మరో మూడు నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ వైపే నిలిచారని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
తూర్పులో ఎగిరే జెండా ఎవరిది..
తూర్పు గోదావరి జిల్లా లో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికి అధికారం ఖాయమనే ప్రచారం ఉంది. ఇక్కడ జనసేన ఈ సారి బలంగా ఓట్లను దక్కించుకుంది. అయితే, టిడిపి..వైసిపి సైతం గట్టి పోటీ ఇచ్చాయి. పోలింగ్ సరళిని గమనించిన వారు చెబుతున్న లెక్కల ప్రకారం జనసేన ప్రభావం ఎక్కువగా టిడిపి మీద ఉండగా.. వైసిపి సైతం ఎఫెక్ట్ అయందని చెబుతున్నారు. ఎంపి సీట్లకు మాత్రం పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని అంచనా వేస్తున్నారు. ఇక, టిడిపి గతంలో సాధించిన సీట్లు తిరిగి దక్కించుకొనే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో వైసిపి కేవలం అయిదు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అందులో ముగ్గురు టిడిపిలోకి ఫిరాయించారు. ఇక, ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాల్లో సీట్ల కేటాయింపు సమయంలోనే వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టిడిపి సిట్టింగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, ఇక్కడి 19 సీట్లలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక సమీకరణం..
ఇక, ఈ రెండు జిల్లాల్లోనూ ప్రధానంగా ఉండే ఓ సామాజిక వర్గం జనసేనకు అండగా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది . ఇక, భీమవరం నుండి పవన్ పోటీలో ఉండటంతో అది సైతం జనసేనకు కలిసి వచ్చిందని చెబుతున్నారు. అయితే టిడిపి ముఖ్యనేత తమ పార్టీ సమీక్షలో జనసేన కారణంగా దాదాపు 36 సీట్లలో టిడిపికి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. అదే విధంగా వైసిపికి కొంత నష్టం తప్పలేదని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. దీంతో..ఇప్పుడు ఆ రెండు జిల్లాల్లో టిడిపి..వైసిపి..జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తారనే దానికి అనుగుణంగా అధికారానికి దగ్గర అవుతారనేది వాస్తవం. తాము మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసిపి గట్టిగా చెబుతోంది. టిడిపి నేతలు మాత్రం గతంలో సాధించిన సంఖ్య రాదని చెబుతున్నారు. దీంతో..అసలు ఈ రెండు జిల్లాలోని ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తెలుసుకోవటంలో ఇంకా కసరత్తు చేస్తున్నాయి.