పోటెత్తుతున్న నదులు...జలాశయాల గేట్లు ఓపెన్:వరద బాధితులకు పాముల బెడద...ఒక్కరోజులో ఒక్క చోటే 24 మందికి
విజయవాడ:ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు...మరోవైపు గోదావరి వెల్లువలు...ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు ప్రధాన నదులు పరిస్థితి...ఎగువన కురిసిన వర్షాలకు పోటెత్తిన వరద నీటితో ఈ రెండు నదులు నిండుకుండల్లా మారాయి.
ఐదేళ్లలో మూడోసారి శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకోగా...కృష్ణమ్మ నాగార్జున సాగర్ దిశ వైపు పరవళ్లు తొక్కుతూ దూసుకొస్తోంది. ఇక కొత్త నీటితో గోదావరి ఎర్రసముద్రాన్ని తలపిస్తోంది. దీంతో రెండు నదుల లంకల్లోని అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇదంతా ఒక ఎత్తైతే కృష్ణా నది పరిధిలోని దివిసీమ వాసులను ఇప్పుడు పాముల బెడద పీడిస్తోంది. వరదలకు పెద్ద సంఖ్యలో కొట్టుకొచ్చిన పాముల కారణంగా ఒక్కరోజులో ఒక్క ప్రాంతంలో 24 మంది పాముల కాట్లుకు గురయ్యారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కృష్ణా నది...పరవళ్లు
కృష్ణా నదికి ఎగువ నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి నిండుకుండలా మారుతుండటంతో శనివారం రిజర్వాయరు 8 క్రస్ట్ గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ నాగార్జునసాగర్ దిశగా దూసుకువస్తోంది. ఈ క్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం ఉదయం ఆరో నెంబరు గేటును ఎత్తి నీటి విడుదల ప్రారంభించారు. మొత్తం ఏడు క్రస్ట్గేట్ల ద్వారా 1,86,564 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. ఎగువ నుంచి నీటి చేరిక మరింత పెరుగుతుండటంతో... రాత్రి 10 గంటల సమయంలో మరో గేటు కూడా ఎత్తేశారు.
గేట్లు...బార్లా తెరిచేశారు
ఇలా ప్రస్తుతం 8 గేట్లద్వారా 2,13,564 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటల సమయానికి శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 882 అడుగుల వద్ద 198.81 టీఎంసీల నీరు నిల్వ ఉండగా...జూరాల నుంచి 1,21,858 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 1,86,672 క్యూసెక్కులు... మొత్తం 2,78,530 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ప్రకాశం బ్యారేజీకి వరద పెరగడంతో నాలుగు గేట్లను ఎత్తి 2900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.
కృష్ణమ్మను ప్రార్థించా:మంత్రి ఉమ
మరోవైపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలు, రైతులు చేస్తున్న కృషికి...పడుతున్న కష్టానికి కృష్ణమ్మ దయ తోడయిందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఎకరానికి చివరి ఆయకట్టు వరకు నీరందించేలా తాను కృష్ణమ్మను ప్రత్యేకంగా ప్రార్థించానని మంత్రి ఉమ తెలిపారు. రాయలసీమలో వర్షపాతం తక్కువగా నమోదైందని...తెలుగుగంగ, హంద్రీ నీవా, కేసీ కెనాల్, గాలేరు నగరి ద్వారా సీమకు నీటిని విడుదల చేస్తామని మంత్రి ఉమ చెప్పారు. కడప జిల్లా పులివెందులకు కూడా నీరు అందిస్తున్నామని మంత్రి ఉమ వెల్లడించారు.
దివిసీమ...పాముల బెడద
కృష్ణా జిల్లా దివిసీమ వాసులకు ఇప్పుడు పాముల బెడద ఎక్కువైంది. ఇప్పటికే వరదనీటి ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజలకు పాముల వీరవిహారంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వరద నీటిలో భారీగా కొట్టుకొచ్చిన పాములు పలువురిని కాటేశాయి. ఆదివారం ఉదయం తమను పాము కరిచిందంటూ ఒక్కరోజే అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి 24 మంది రావడంతో వారందరికీ హాస్పిటల్ సిబ్బంది వైద్యం అందించారు. అలాగే వరదల్లో చిక్కుకున్న గ్రామాలు మొత్తం బురద చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా తయారయ్యాయని...వీలైనంత త్వరగా శుభ్రపర్చకపోతే అంటురోగాలు ప్రబలడం ఖాయమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.