పైలాన్ ఆవిష్కరణ: కృష్ణలోకి గోదావరి, పట్టిసీమ అంటే ఇదీ?, వైయస్ సైతం
అమరావతి: కృష్ణాజిల్లాలోని ఇబ్రహింపట్నం సమీపంలోని ఫెర్రీ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం పైలాన్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. పైలాన్కు ఇరువైపులా కృష్ణ, గోదావరి మాతల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో ఏపీ శాసనసభ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. పట్టిసీమ ప్రాంతంలో వర్షాలు కరుస్తుండటంతో ముందుగా ఇబ్రహీంపట్నం బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం 3.45నిమిషాలకు పట్టిసీమకు వెళ్లనున్నారు.
కృష్ణలోకి గోదావరి నీరు వచ్చి చేరనుంది. భారతదేశ చరిత్రలో ఓ మహత్తర ఘట్టానికి 'సెప్టెంబర్ 16, 2015' సాక్షిగా నిలవనుంది. ఓ మహోన్నత కల సాకారమయ్యేందుకు సమయం ఆసన్నమైంది. గోదావరి నదిపై పోలవరం వద్ద ప్రాజెక్టును నిర్మించి, అక్కడ నీటిని కృష్ణా జిల్లా అవసరాలకు వాడుకుంటూ, కృష్ణలో మిగిలే నీటిని రాయలసీమకు తరలించాలన్న ఉద్దేశంతో ఉన్న ఏపీ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్న నేపథ్యంలో ఈ పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇది ఓ ఎత్తిపోతల పథకం.
బుధవారం ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు, ఉన్నతాధికారులు శాస్త్రోక్తంగా పూజాదికాలు, మేళతాళాల మధ్య నదీ జలాల సంగమానికి హారతి ఇచ్చి, పట్టిసీమ పంపు ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీటిని కృష్ణానదికి చేర్చి రెండు నదులను అనుసంధానించి, ఆపై అంతే మొత్తం నీటిని శ్రీశైల ప్రాజెక్టు నుంచి రాయలసీమకు తీసుకెళ్తారు. ఇందుకోసం తరలివచ్చే ప్రజల కోసం దాదాపు 25 ఎకరాల భూమిని చదును చేసి విస్తృత ఏర్పాట్లు చేశారు.
171వ కి.మీ వద్దకు చేరిన గోదావరి నీరు:
వాస్తవానికి పట్టిసీమ సైతం అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో తాడిపూడి ఎత్తి పోతల పథకం ద్వారా గోదావరి నీటిని గుడ్డి గూడెం వద్ద పోలవరం కుడి కాలువలోకి కలిపి నీటిని కృష్ణానదికి తరలిస్తున్నారు. ఈ నీరు పోలవరం కుడి కాలువలో 171వ కిలోమీటరు వద్దకు చేరింది.
అక్కడ వెలగలేరు వద్ద భలేరావు ట్యాంకు ఉంది. ఆ చెరువు గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరిన తర్వాత ఆ గట్టు తొలగించి నీటిని బుడమేరులోకి మళ్లిస్తారు. తాడిపూడి ద్వారా ఇస్తున్న గోదావరి నీరు ఆ చెరువులోకి వేగంగా చేరుతోంది.
History
will
be
made
today.
Awaiting
the
moment
to
release
water
from
#Pattiseema
Project,
completed
in
record
time
of
over
5
months.
—
N
Chandrababu
Naidu
(@ncbn)
September
16,
2015
పట్టిసీమ నుంచి బుధవారం నీరు విడుదల చేసిన తర్వాత అది కూడా ఇప్పటికే కాలువలో ఉన్న నీటితో కలుస్తుంది. భలేరావు ట్యాంకులోంచి బుడమేరు ద్వారా వెలగలేరు రెగ్యులేటర్ దాటి, బుడమేరు మళ్లింపు కాలువలో చేరి విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది.
దీంతో గోదావరి నీరు వెలగలేరు రెగ్యులేటర్ను దాటితే రెండు నదుల అనుసంధానం జరిగినట్టే. పోలవరం పూర్తయితే, 80 టీఎంసీల నీరు కృష్ణమ్మకు తరలించే అవకాశాలు ఉండగా, ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 13 నుంచి 15 టీఎంసీల నీటిని కృష్ణకు చేర్చవచ్చు.
ఇబ్రహీం పట్నం వద్ద బహిరంగ సభ:
గోదావరి.. కృష్ణలో సంగమించే అపూర్వ ఘటనకు ఇబ్రహీంపట్నం మండలంలోని ఫెర్రీ అనే కుగ్రామం వేదిక కాబోతోంది. చంద్రబాబు పట్టిసీమ వద్ద నీరు విడుదల చేసి మధ్యాహ్నాం గోదావరి-కృష్ణా సంగమ ప్రాంతంలో ఇబ్రహీం పట్నం వద్ద ఫైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి 'కృష్ణా గోదావరి పవిత్ర సంగమం'గా పేరు పెట్టారు.
ఈ పవిత్ర కార్యాన్ని కళ్లారా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు లక్ష మంది ప్రజలను సమీకరించేందుకు గ్రామ, గ్రామానికి ఆర్టీసీ బస్సులను ముందుగా పంపుతున్నారు. ఇందుకు దాదాపు 3 వేల ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇందిరా సాగర్ పేరిట వైయస్ ఆనాడే శంకుస్ధాపన:
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇందిరా సాగర్ పేరిట శంకుస్థాపన చేయటమేగాక ముందుగా కాలువల తవ్వకాలు ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి కాకుండా ముందుగా కాలువలు తవ్వడం ఏమిటంటూ ఎంతోమంది విమర్శించారు. వాస్తవానికి ఈ కాలువలే గడచిన ఆరేళ్లలో సంభవించిన వరదల వల్ల పంట భూములు ముంపుకు గురికాకుండా కాపాడగలిగాయి. కోర్టు వివాదాల వల్ల కాలువ నిర్మాణానికి పలుచోట్ల అవాంతరాలు ఏర్పడ్డ సంగతి తెలిసిందే.
గోదావరి జలాలను ఈ కాలువ ద్వారా జి.కొండూరు మండలం బుడమేరు రెగ్యులేటర్ వద్దకు చేర్చి అక్కడి నుంచి విటిపిఎస్ డైవర్షన్ కాలువ ద్వారా కృష్ణా నదిలోకి కలపాలన్నది ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమతం. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన చనిపోయారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా లభించింది.
ఇదే సమయంలో కృష్ణా డెల్టా ప్రజలు సాగు, తాగునీటికి తల్లడిల్లుతున్న పరిస్థితి గమనించిన చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇందుకోసం దాదాపు రూ. 1300 కోట్లు పైగా ఖర్చు చేశారు. ప్రధానంగా కోర్టు వివాదాలను పరిష్కరించి రైతులను విశ్వాసంలోకి తీసుకుని దాదాపు రూ. 700 కోట్లు పైగా పరిహారం చెల్లించి భూములను స్వాధీనంలోకి తీసుకుని కాలువలను తవ్వించారు.
2015 జనవరి 1న జివో జారీ కాగా మార్చి 29న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు తిరిగి శంకుస్థాపన చేశారు.