కొబ్బరాకులా వణుకుతున్న కోనసీమ.!కరోనా తీవ్రతకు అవాక్కవుతున్న గోదారి జనం.!
అమరావతి/హైదరాబాద్ : పచ్చదనం, ప్రకృతి రమణీయత. నిత్యం చిరుగాలులు చేసే సవ్వడులకు లయబద్దంగా పారే సెలయేళ్లు, వాటికనుగుణంగా పక్షులు చేసే కిలాకిలా రావాలాతో ఎటు చూసినా ఆహ్లాద వాతావరణం సాక్షాత్కరించే కోనసీమలోని ప్రజల ఆధరాభిమానాలకు కొలమానం ఉండదు. ఎవరైనా అతిధులు ఇంటికి వస్తే సకల మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి చేయడం కోపసీమ ప్రజల స్వచ్చమైన ప్రేమకు నిదర్శనంగా గుర్తింపుపొందింది. బంధాలు అనుబంధాలు, ప్రేమ, మమకారాలతో పచ్చగా ఉండే గోదారి జిల్లాలను కరోనా కర్కషంగా కాటేసింది. విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నట్టు తెలుస్తోంది.
గోదారి జిల్లాలను వణికిస్తున్న కరోనా..
ప్రకృతి అందాలతోనే కాకుండా రుచికరమైన వంటకాలకు, ఎక్కడ కనీ వినీ ఎరుగని మర్యాదలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలను కరోనా మహామ్మారి కబళించి వేస్తోంది. చల్లని ప్రకృతి, ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు గలాగలా పారే సెలయేళ్లతో రమణీయంగా ఉండే కోనసీమ ప్రాంతం ప్రస్తుతానికి కరోనా నిలయంగా మారిపోయింది. రోజు రోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసుల పట్ల గోదారి జిల్లాల ప్రజలు బెంబేలెత్తి పోతున్నట్టు తెలుస్తోంది. కాలూష్య రహిత జిల్లాలుగా గుర్తింపుపొందిన ఉభయ గోదావరి జీల్లాల్లో కరోనా ఎందుకు అంత తీవ్రంగా వ్యాపిస్తుందో అర్తంగా కాక గోదారి జిల్లా ప్రజలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
కోనసీమపై కరోనా కన్నెర్ర..
మొదట్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకున్న ఉభయ గోదావరి జిల్లాలు నేడు కరోనా ధాటికి విలవిల్లాడుతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు తూర్పుగోదావరిలో కరోనా పంజా విసరగా ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో కూడా విజృంభిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులిటెన్ లో అత్యధిక కేసులు పశ్చిమగోదావరి జిల్లాలో నమోదయినట్టు నిర్థారణ కావడంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నట్టు తెలుస్తోంది. 623 కేసులు ఆ జిల్లాలో నమోదైనట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటెన్ విడుదల చేయడం పట్ల గోదారి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆహ్లాద వాతావరణం గోదారి ప్రాంతం సొంతం..
కరోనా కొత్త పాజిటీవ్ కేసుల రికార్డులో ఏపీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదని నిర్థారణ అవుతోంది. రోజుకు 5 వేల కొత్త కేసులు నమోదవ్వడం సర్వత్రా కలవారికి గురిచేస్తోంది. కాగా గడచిన 24 గంటల్లో 37,162 మంది నమూనాలు పరీక్షించగా 4,944 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఉభయగోదావరి జిల్లాల్లో రోజురోజుకీ పెరుగుతున్న మరణాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తాజా బులిటెన్ ప్రకారం ఒకేరోజు 62 మంది చనిపోయారు. మరణాలు కూడా గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ నమోదవుతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది.
మరోసారి కర్ఫ్యూ..
ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా గోదారి జిల్లాల్లో ఎందుకు కరోనా కేసులు పెరుగుతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. స్వీయ నియంత్రణ పాటిస్తూ, లాక్డౌన్ ఆంక్షలను పాటిస్తున్నప్పటికి కేసులు పెరగడం ఆందోళనకరంగా పరిణమించింది. మరణాలు కూడా ఊహించని స్థాయిలో నమోదు అవుతుండడంతో ప్రజలు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో కరోనా వైరస్ కట్టడి కోసం కొన్ని ప్రాంతాల్లో మరోసారి కర్ఫ్యూ అమలు చేస్తోంది ప్రభుత్వం. కర్ఫ్యూ పకడ్బంధీగా అమలయిన తర్వాత కరోనా ఏ మేరకు అదుపులోకి వస్తుందో చూడాలి.