సమయం ముగిసింది: భారీగా ఏర్పాట్లు, దీపారాధన చేయాలన్న చంద్రబాబు?
రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు శనివారం సాయంత్రం 6.30 నిమిషాలకు ముగియనున్నాయి. ముగింపు వేడులకు ఘనంగా నిర్వహించాలని తెలుగు రాష్ట్రాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతి కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ పుష్కరాల ముగింపు వేడుకలకు రావాలన్న సీఎం చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించిన ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా రాజమండ్రికి చేరుకున్నారు. రాందేవ్ బాబాకు ఏపీ మంత్రి పల్లె రఘనాథ రెడ్డి ఘన స్వాగతం పలికారు. శనివారం గోదావరి పుష్కరాల్లో చివరి రోజు కావడంతో పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కర ఘాట్లలో భక్తులు కిటకిటలాడుతున్నాయి.
గోదావరి నదిలో పుణ్య స్నానాలు, పిండ ప్రదానాలు చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రిలోని పుష్కరఘాట్లో ముగింపు వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. పుష్కరాల ముగింపు వేడుకల్లో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇక పుష్కరాల ముగింపు వేడుకలకు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అందంగా ముస్తాబైంది. ఈ వేడుకలో వెయ్యిమంది కూచిపూడి కళాకారులతో నిర్వహించనున్న నృత్యరూపకం భక్తులను అలరించనుంది. అంతేకాక ప్రముఖ సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలబురళీకృష్ణచే కర్ణాటక గాత్ర సంగీతం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో దీపారాధన చెయ్యాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ముందుగా రాజమండ్రి నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. గోదావరి అఖండ హారతి కార్యక్రమం ముగిసిన అనంతరం దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
గోదావరి అఖండ హారతి అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఘనంగా ప్రారంభమైన గోదావరి మహా పుష్కరాలను అంతే గొప్పగా ముగించాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పుష్కరాలు ముగింపు రోజున గోదావరి అఖండ హారతి కార్యక్రమాన్ని మరింత ఆర్భాటంగా నిర్వహించేందుకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఈనెల 14న ఉదయం 6.26గంటలకు పుష్కరాలు మొదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు పుష్కరఘాట్లో తొక్కిసలాట జరిగి 27మంది మృతి చెందిన సంఘటన మినహా మిగిలిన 10రోజులూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. తోలి రోజు తొక్కిసలాట ఘటనతో పుష్కరాల ఏర్పాట్లను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షించారు.
ప్రతి రోజు రాత్రి పుష్కరాల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి, ఆ రోజు జరిగిన లోటు పాట్లపై ఆదేశాలు ఇవ్వడం లాంటివి చేశారు. ఆ తర్వాత రాజమండ్రి నగరంలోని ఘాట్లు, ఆర్టీసీ బస్స్టేషన్లు, ఇతర ప్రాంతాలను పరిశీలించటం, భక్తులతో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకోవటం వంటి కార్యక్రమాలను కొనసాగించారు.
గోదావరి పుష్కరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు రాజమండ్రిలోనే 14 రోజుల పాటు మకాం చేశారు. దాదాపుగా ఈ 14 రోజులు రాజమండ్రి నుంచే పరిపాలన కొనసాగించారు. సింగపూర్ బృందంతోనూ, పారిశ్రామికవేత్తలతోను రాజమండ్రిలోనే సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని కూడా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలోనే నిర్వహించడం విశేషం.