కాటన్ బ్యారేజ్ లో ప్రమాద స్థాయికి గోదావరి నీటిమట్టం...'పశ్చిమ'లో కూలిన బ్రిటీష్ కాలం నాటి వంతెన
Recommended Video
ధవళేశ్వరం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. బ్యారేజీ నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
సోమవారం సాయంత్రం 5గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 14.3 అడుగులకు చేరింది. ప్రస్తుతం సముద్రంలోకి సుమారు 13,71,582 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో బ్యారేజీపై కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో పెనుముప్పు తప్పింది...బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ధవళేశ్వరం బ్యారేజీకి భారీస్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నందున పాదచారులను,ద్విచక్రవాహనాలను మినహా మరెవ్వరినీ అనుమతించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పలువురు వాహనదారులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారని, అయినా ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి నడుచుకుంటున్నామని చెప్పారు. అలాగే గోదావరి ఉద్ధృతి కారణంగా పడవ ప్రయాణాలను నిషేధించినట్లు చెప్పారు.
ధవళేశ్వరం వద్ద నీటిమట్టం మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేస్తామని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాజమహేంద్రవరం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్ కమ్ రైల్వే వంతెనపై భారీ వాహనాలు ప్రయాణించకుండా నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. గోదావరి తీరానికి ప్రజలెవరూ రావొద్దని.. యువకులు సెల్ఫీల మోజుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వంతెనలు కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో కొన్ని చారిత్రాత్మక నేపద్యం ఉన్న వంతెనలు కూడా ఉంటుండటం గమనార్హం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఓ వంతెన కూలిపోయింది. ఖమ్మం, రాజమహేంద్రవరం ప్రదాన రహదారిపై బ్రిటషర్లు 1933లో బయనేరు వాగులపై నిర్మించిన ఈ పురాతన వంతెన భారీ వర్షాలకు కూలిపోయింది.
బయనేరు వాగుపై 8 దశాబ్దాల క్రితం బ్రిటీషర్లు నిర్మించిన ఈ వంతెన ఆ ప్రాంత ప్రజలకు విస్తృత సేవలందించిందని స్థానికులు చెబుతున్నారు. తమ్మిలేని, ఎర్రకాలువలు పొంగి పొర్లుతుండటంతొ గేట్లు ఎత్తివేయటంతో ఈ వంతెనకు ప్రమాదం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. కాగా వంతెన కూలిపోవడానికి ముందే ఓ వ్యక్తి ఈ వంతెన దాటాడని, అతడు దాటిన మరుక్షణమే ఈ వంతెన కూలిపోవడంతో అతడిని మృత్యుంజయుడిగా ప్రత్యక్ష సాక్షులు అభివర్ణిస్తున్నారు.
మరోవైపు జంగారెడ్డి గూడెంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలో దాదాపు 500 వందలమంది భక్తులు చిక్కుకుపోగా వారిని తీవ్రంగా శ్రమించి సహాయక సిబ్బంది కాపాడారు. దీనిపై వారికి ప్రశంసలు అందుతున్నాయి.