కచ్చులూరు.. మృత్యు మలుపు: తెలిసి.. తెలిసీ మృత్యుముఖంలోకి !
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు.. మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే రెండు సార్లు పడవలు, లాంచీలను పొట్టన పెట్టుకున్న ఈ ప్రాంతం.. మరోసారి ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. మరింత మందిని మృత్యుముఖంలోకి నెట్టేసింది. కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో ఆదివారం రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదానికి గురైన ఘటనలో 13 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. గల్లంతైన పర్యాటకులు మరింత మంది ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇదే ప్రమాదం నుంచి సుమారు 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. జాడ తెలియ రాకుండా వెళ్లిన పర్యాటకుల కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు చేపట్టిన గాలింపు చర్యలకు బ్రేక్ పడొచ్చని తెలుస్తోంది.
గోదావరి లాంచీ ప్రమాదం: 13కు చేరిన మృతుల సంఖ్య: సురక్షితంగా బయటపడ్డ వారు వీరే..
కచ్చులూరు వద్దే మూడోసారి ప్రమాదం..
కచ్చులూరు వద్ద పర్యాటకుల లాంచీ బోల్తా పడటం ఇది మూడోసారి. ఇదివరకు రెండు సార్లు ఇదే ప్రదేశంలో గోదావరి నదిలో పడవ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో వేర్వేరుగా 68 మంది జలసమాధి అయ్యారు.1964లో కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో ఉదయ్ భాస్కర్ అనే లాంచీ ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో 60 మంది మృత్యువాత పడ్డారు. అనంతరం అదే ప్రాంతంలో ఝాన్సీరాణి అనే పడవ మునిగిపోయింది. నాటి ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది జలసమాధి అయ్యారు. తాజాగా.. ఆదివారం కూడా అదే కచ్చులూరు ప్రాంతంలోనే లాంచీ ప్రమాదానికి గురి కావడం చర్చనీయాంశమైంది. గండి పోచమ్మ ఆలయం నుంచి ఎగువకు పాపికొండల దిశగా ప్రయాణమైన రాయల్ వశిష్ఠ లాంచీ.. ఒక్కసారిగా కుదుపులకు గురై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు.
ప్రమాదకరమైన మలుపు.. గోదావరి ఉధృతం
కచ్చులూరు నుంచి టేకూరు వైపు వెళ్లే జలమార్గంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుందని స్థానిక మత్స్యకారులు, లాంచీలను నడిపే సారంగులు, డ్రైవర్లు చెబుతున్నారు. భౌగోళికంగా మలుపు తిరిగే ప్రదేశం కావడం వల్ల ఎగువ నుంచి గోదావరి ప్రవాహం తోసుకొస్తుంటుంది. ఉధృతి తీవ్రంగా ఉంటుంది. గోదావరి నదిని చీల్చుకుంటూ ఎగువకు ప్రయాణించే పడవలు గానీ, లాంచీలు గానీ.. ప్రమాదానికి గురయ్యే సందర్భాలు ఇలాంటి చోట్లే ఎదురవుతుంటాయని వారంటున్నారు. లాంచీలను నడిపడంలో అనుభవం, నైపుణ్యం ఉన్న సారంగులు,, డ్రైవర్లకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని నియంత్రించడం సాధ్యపడదని అంటున్నారు. గోదావరి నదీ లోతుగా ఉండటం, మలుపులో సుడిగుండాలు ఏర్పడుతుండటం ప్రమాదానికి ప్రధాన కారణాలవుతుంటాయని మత్స్యకారులు వెల్లడిస్తున్నారు.
ప్రమాదకరమని తెలిసినా..
కచ్చులూరు మలుపు అత్యంత ప్రమాదకరమనే సమాచారం ఈ మార్గంలో లాంచీలు, పడవలను నడిపే ప్రతి డ్రైవర్ కు ఉందని, చాలా సందర్భాల్లో వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలకు కారణమౌతుంటాయని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ల వల్ల చోటు చేసుకునే ఏ చిన్న పొరపాటైనా పదుల సంఖ్యలో ప్రాణాలను తీసివేసే అవకాశానికి దారి తీస్తాయని తెలిసినా పట్టించుకోవట్లేదని అంటున్నారు. ప్రస్తుతం- అయిదు లక్షల నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రభావం ఉధృతంగా ప్రవహిస్తోన్న సమయంలో కూడా అదే నిర్లక్ష్యం కొంప ముంచిందని వాపోతున్నారు స్థానిక మత్స్యకారులు. ఇంత పెద్ద ఎత్తున వరద ఉధృతి సంభవించిన సమయంలో పర్యాటకుల కోసం పాపికొండల వరకు లాంచీలను తిప్పిన సందర్భాలు చాలా అరుదేనని అంటున్నారు. తమకు తెలిసినంత వరకూ గోదావరిలో వరద ఉధృతి అధికంగా ఉన్న సమయాల్లో లాంచీలను తిప్పలేదనే చెబుతున్నారు స్థానికులు.