గోదావరి ఉధృతి: వరద ముంపులో లంక గ్రామాలు, నిండుకుండల్లా ధవళేశ్వరం, శ్రీశైలం గేట్లు ఎత్తివేత
అమరావతి: భారీ వర్షాలు ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని గోదావరి తీర లంక గ్రామాలు ముంపుతో అల్లాడుతున్నాయి.
వరద ఉద్ధృతి దృష్ట్యా అధికారులు నాటు పడవల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో లంక గ్రామాలకు వెళ్లేవారికి, లంక గ్రామాల నుంచి ఇవతలి తీరానికి వచ్చే వారికి ఇబ్బందులు పెరిగాయి.
బయటి ప్రపంచంతో సంబంధాలు తెలిగిపోయాయి
కాగా, గోదావరి వరద ఉధృతి కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి తీరంలోని లంక గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది.
Recommended Video
చుట్టుముట్టిన వరద.. భయాందోళనలో ప్రజలు
పశ్చిమ గోదావరి జిల్లా ముఖద్వారం సిద్ధాంతం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. లంకల్లో పంట పొలాలున్న వారు, పాడిపశువులున్నవారు వెళ్లటానికి మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆచంట మండలం పరిధిలోని అయోధ్యలంక, పుచ్చల్లంక, రాయిలంక, మర్రిమూల, భీమలాపురం, పల్లెపాలెం, పెదమల్లంక, అనగారిలంక గ్రామాల వద్ద గంటగంటకూ గోదావరి మట్టం పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులు కావాలన్నా గోదావరి దాటి రావాల్సి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. గోదావరి దాటి రావాలంటే వీరికి నాటు పడవలే దిక్కు. గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తచర్యగా గోదావరిలో పడవలు తిరగకుండా రాకపోకలు నిషేధించటంతో లంక గ్రామాలకు బయటి ప్రపంచంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దాంతం వద్ద గోదావరి లోపల లంకల్లో సుమారు 500 వరకు పాడిపశువులు చిక్కుకుపోయాయి. గడిచిన నాలుగురోజులుగా గోదావరి పెరుగుతుండటంతో రైతులు వాటి ఆలనా, పాలనా చూసే అవకాశం లేకపోయింది. తమను ఆదుకోవాలని లంక గ్రామాల ప్రజలు ప్రభుత్వం, అధికారులను కోరుతున్నారు.
ప్రమాదకరస్థితిలో పయనం
తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పలు లంక గ్రామాలను వరదనీరు చుట్టుముట్టింది. గోదావరి మధ్యలో ఉన్న లంక గ్రామాల ప్రజలు బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుబీడుం, జి.పెదపూడి, కె.ఏనుగుపల్లిలంక, శివాయిలంక కాజ్వేలు వరదనీటిలో ముంపు బారిన పడ్డాయి. లంక భూముల్లోని పలు పంటలు ముంపుబారిన పడ్డాయి. అయినవిల్లి మండలంలోని ముక్తేశ్వరం వద్ద కాజ్వే నీట మునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగతోంది. అత్యవసర పనులు ఉన్నవారు మోకాళ్ల లోతు నీళ్లలో నుంచి నడుచుకుంటూ ప్రమాదకర స్థితిలో కాజ్వే దాడుతున్నారు.
నిండుకుండలా ధవళేశ్వరం.. రెండో ప్రమాద హెచ్చరిక
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారంమే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయగా.. శనివారం ఉదయానికి నీటిమట్టం మరింత పెరిగింది. ఈరోజు ఉదయానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 14.6 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. బ్యారేజీ గేట్లు ఎత్తి దిగువకు 14.15 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు వరద ముంపులోనే బిక్కుబిక్కుమంటున్నాయి. చాలాచోట్ల కాజ్వేలు మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనేక గ్రామాల నుంచి రాకపోకలకు నాటు పడవలే దిక్కయ్యాయి. మరోవైపు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుడంతో నాటు పడవలపై ప్రయాణం సురక్షితం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శ్రీశైలం గేట్లు ఎత్తివేత
కృష్ణా నది వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వచ్చే ఇన్ఫ్లో 3,47,671 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో శనివారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు అధికారులు ఎత్తివేశారు. జలాశయం నుంచి 2,07,561 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వారం రోజుల పాటు ఇన్ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.1 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగ.. ప్రస్తుతం నీటి నిల్వ 193.8 టీఎంసీలకు చేరింది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్ఫ్లో 64,863 క్యూసెక్కులు కాగా ఔట్ఫ్లో 8,438 క్యూసెక్కులుగా ఉంది.. నాగార్జున సాగర్లో వాస్తవ నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 168 టీఎంసీలుగా ఉంది.