చారిత్రక ఘట్టం: కృష్ణా జిల్లాలో గోదావరి నీళ్లు, పూజలు చేసిన దేవినేని
విజయవాడ: కృష్ణా జిల్లా దిశగా గోదావరి పరుగు పెడుతోంది. పోలవరం కుడికాలువలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతోంది. బుధవారం నాడు గోదావరి నీళ్లు కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి.
పట్టిసీమ ఎత్తిపోతల పంపు నుంచి నీటిని ఇచ్చే లోపు తాడిపూడి ఎత్తిపోతల ద్వారా అదనంగా ఉన్న పంపుల సాయంతో పశ్చిమ గోదావరి అవసరాలు తీర్చిన అనంతరం... అందుబాటులో ఉన్న నీటిని కుడి కాలువలో నింపారు.
సెప్టెంబర్ 4నే తాడిపూడి నీరు 600 క్యూసెక్కుల వరకు పోలవరం కుడి కాలువలోకి మళ్లించారు. ఆ నీటిని ముందుగా పోలవరం కుడి కాలువ సామర్థ్యం మేరకు నింపి, ఆ ప్రవాహం ముందుకు సాగేలా ఏర్పాట్లు చేశారు. పోలవరం కుడి కాలువ మొత్తం 174 కిలో మీటర్లు ప్రవహించి ఆ తర్వాత కృష్ణా నదికి ఆ నీరు చేరుతుంది.
తాడిపూడి ద్వారా పోలవరం కాలువకు అనుసంధానించిన గోదావరి నీరు, వర్షాల వల్ల చేరిన నీరు కలిసి ముందుకు సాగుతోంది. 119వ కిలోమీటరువద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాలి.
బుధవారం ఉదయం కృష్ణా జిల్లాలో గోదావరి నీరు అడుగు పెడుతుంది. దేవరపల్లి వద్ద లోతైన మలుపులను, గుండేరు, తమ్మిలేరు అక్విడక్టులను దాటుకుంటూ పోలవరం కాలువలో నీరు ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ఒక పంపు ద్వారా 350 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయనున్నారు. దీన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఇందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రెండు పంపులు పట్టిసీమ చేరుకున్నాయి. మరో రెండు పంపులు రానున్నాయి. వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
పోలవరం కుడి కాలువ ద్వారా పెదవేగి మండలం జానంపేట వద్దకు చేరిన గోదావరి నీటికి కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్, దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, స్థానిక రైతులు, మహిళలు పూలు, కలశాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిదశలో 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీరు మంగళవారానికి పెదవేగి మండలం జానంపేటకు చేరుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని 40 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు.
ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ... చంద్రబాబు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి భూసేకరణ చేయడంతోపాటు, నిరంతర పర్యవేక్షణ చేశారని, ఇది ప్రజా విజయమన్నారు.
గోదావరి నీరు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లమూడికి చేరుకునే సమయంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికేందుకు మంత్రి ఉమామహేశ్వర రావు, ఏలూరు ఎంపీ మాగంటిబాబు, విప్ ప్రభాకర్, నూజివీడు మండల నాయకులు మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు. గోదావరి నీటి రాకను స్వాగతిస్తూ హారతి ఇచ్చారు.
కృష్ణలోకి ప్రవేశించిన నీరు
నదుల అనుసంధానానికి తొలి అడుగు పడింది. కృష్ణా జిల్లా పల్లెర్లమూడి వద్ద కృష్ణాజిల్లాలోకి గోదావరి నీటిని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రావు బుధవారం ఉదయం విడుదల చేశారు. పూజలు, పూర్ణ కుంభంతో గోదావరి నీటికి రైతుల స్వాగతం పలికారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు.