అన్నపూర్ణ దేవిగా బెజవాడ కనకదుర్గ అమ్మవారు
Recommended Video
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతున్నారు అమ్మవారు.
ఆదివారం మూల నక్షత్రం కావడంతో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం మాత్రం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. రద్దీ తగ్గినా పోలీసుల ఆంక్షలు సడలించకపోవంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
పోలీస్ కంట్రోల్ రూమ్, పండిట్ నెహ్రూ బస్టాండ్, భవానీపురం వద్దే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్తే భక్తులు సుమారు 2కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. రద్దీ లేకపోయినా ఆంక్షలు విధించడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.