మూడు కిలోల బంగారాన్ని టాయిలెట్లో పడేశాడు
హైదరాబాద్: కస్టమ్స్ అధికారులు ఎంతగా పట్టుకున్న హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దొంగ బంగారం రావడం ఆగడం లేదు. అధికారుల నిఘాను పసిగట్టిన ఓ వ్యక్తి మూడు కిలోల బంగారాన్ని టాయిలెట్లో పడేశాడు.
ఆ వ్యక్తి నుంచి అధికారులు మరో రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన నజీర్ (35) ఒమన్ ఎయిర్లైన్స్ విమానంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
అతను బంగారం అక్రమంగా తీసుకుని వస్తున్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు అప్రమత్తమై నిఘా పెట్టారు. అధికారుల నిఘాను పసిగట్టిన నజీర్ తన లగేజీలో ఉన్న మూడు కిలోల బంగారాన్ని విమానాశ్రయంలోని బాత్రూంలోకి వెళ్లి కుండీలో పడేశాడు. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుండీలోంచి బంగారాన్ని వెలికి తీశారు
ఇదిలావుంటే, శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద 500 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఎమిరేట్స్ సంస్థ విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తెస్తున్నారని ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులందరిని తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద 500 గ్రాముల బంగారం దొరికింది.