పూజ పేరుతో వ్యాపారికి బురిడీ, 50 వేల బంగారు ఆభరణాలు మాయం
దొంగ స్వామి బారిన పడిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు యాభై వేల బంగారు ఆభరణాలను కోల్పోయాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
గుంటూరు:దొంగ స్వాములు, పూజారులు, బాబాల గురించి మోసపోయారంటూ ప్రతిరోజూ ప్రసార సాధనాల్లో పెద్దఎత్తున ప్రచారం సాగుతోన్నా నకిలీ స్వాముల బారిన పడి తమ విలువైన సొమ్మును, నగదును కోల్పోతూనే ఉన్నారు. ఈ తరహ ఘటన ఒకటి గుంటూరులో చోటుచేసుకొంది.
గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయాల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆభరణాలను దొంగ పూజారి మాయం చేశాడు.
గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకుగాను ఓ పూజారిని పిలిపించాడు.
పూజలో కొంత బంగారాన్ని పెట్టాలని నకిలీ పూజారి సూచించాడు.ఈ మాటలను నమ్మిన వ్యాపారి శ్రీనివాస రావు పూజలో యాభైవేల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను పూజలో పెట్టాడు. కాసేపు పూజ చేస్తున్నట్టు నటించిన నకిలీ పూజారి ఆ బంగారు ఆభరణాలను తీసుకొన్నాడు.
పూజ పూర్తైందని చెప్పి నకిలీ పూజారి అక్కడి నుండి పారిపోయాడు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయాన్ని గ్రహించిన వ్యాపారి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.