కేశినేని బస్సులో 7కిలోల బంగారం అదృశ్యం, లైంగిక వేధింపులపై ధర్నా
హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ - చెన్నై కేశినేని ట్రావెల్స్ బస్సులో బంగారం అదృశ్యం అయింది. బస్సులో మహేష్, సెంథిల్ అనే ఇద్దరు వ్యాపారులు రెండు సంచుల్లో ఏడు కిలోల చొప్పున.. మొత్తం పద్నాలుగు కిలోల బంగారాన్ని తీసుకు వెళ్తున్నారు.
అయితే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో జాతీయ రహదారి వద్ద చూసుకునే సరికి అందులో ఓ సంచి లేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంచిలో ఉన్న ఏడుకిలోల బంగారం అదృశ్యం కావడం ఆశ్చర్యపరిచింది.
బంగారం కోసం తొలుత బస్సు అంతా వెదికారు. అయినప్పటికీ దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంత భారీస్థాయిలో బంగారం తరలించేటప్పుడు జాగ్రత్తలు లేకుంట ఎలా అని పోలీసులు బాధితులను ప్రశ్నించారు. చెన్నైలోని నగల దుకాణంలో వారు పని చేస్తున్నారని తెలుస్తోంది.
లైంగిక వేధింపులకు నిరసనగా ధర్నా
చిత్తూరు జిల్లాలోని సీటీవో లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ శాఖ ఉద్యోగులు వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయానికి తాళం వేశారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
విశాఖలో గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లాలో రెండు టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.