రూ.4.5కోట్ల ఆభరణాలతో ధనలక్ష్మిగా విశాఖ అమ్మవారు: 2.5కోట్ల నగదుతో అలంకరణ
విశాఖపట్నం: దసరా నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని బంగారం, కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా పర్వదినం సందర్భంగా ఆదివారం అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు పట్టుచీర, సుమారు రూ.4.5కోట్ల నగదుతో అలంకరించారు. అలాగే 4కిలోల బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన నగదులో రూపాయి నుంచి రూ.2వేల వరకు నోట్లు, నాణేలు ఉన్నాయి.
బంగారు ఆభరణాలు, చీరతోపాటు బంగారు బిస్కెట్ల నడుమ అమ్మవారిని కొలువుదీర్చారు. నగరంలో ఉన్న 200మంది భక్తులు ఈ ఆభరణాలను సమకూర్చారు. కాగా, అమ్మవారికి అలంకరించిన నగదును పేద ప్రజల కోసం ఆలయ కమిటీ ఖర్చు చేయనుందని సమాచారం. అయితే, దీనిపై ఆలయ కమిటీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.