కాణిపాకం వినాయకుడికి అరుదైన ప్రభుత్వ కానుక
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో స్వయంభువుగా వెరాజిల్లుతోన్న వరసిద్ధి వినాయకుడికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన కానుకను అందజేయబోతోంది. అదే- బంగారు రథం. ఇప్పటిదాకా ఈ దేవస్థానానికి బంగారు రథం లేదు. ఈ లోటును భర్తీ చేయనుంది. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో వరసిద్ధి వినాయకుడికి బంగారు రథాన్ని తయారు చేయించింది. రథం తయారీ బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించింది. వినాయక చవితి సందర్భంగా సోమవారం ఈ రథాన్ని స్వామివారికి బహూకరించడానికి దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.
సోమవారం ఆరంభమైన వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల నాటికి బంగారు రథాన్ని సిద్ధం చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇదివరకే వెల్లడించారు. 24 క్యారెట్ల బంగారంతో స్వామివారి రథాన్ని రూపొందిస్తున్నామని, ఇందులో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండటానికి రథం తయారీ బాధ్యతలను టీటీడీకి అప్పగించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీ వరకు కన్నుల పండువగా జరిగే కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు.
బ్రహ్మోత్సవాల ఏడవ రోజు నాడు స్వామివారిని రథం మీద ఊరేగిస్తారు. ఈ సారి స్వామివారిని బంగారు రథంలో ఊరేగించాలని పట్టుదలతో ఉన్నామని మంత్రి చెప్పారు. కాగా, వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలకు కాణిపాకం ముస్తాబైంది. ధ్వజారోహణంతో ఆరంభం అయ్యే బ్రహ్మోత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో భక్తులు రావడం ఆనవాయితీగా వస్తోంది.