కృష్ణా నది దీవుల్లో గోల్ఫ్ కోర్సు,హోటళ్లు, రిసార్టుల అభివృద్ధి..బిఎల్ఎఫ్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం
అమరావతిః నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని నూతన కీలక ఒప్పందాలు చేసుకుంది. పర్యాటకులను పెద్దఎత్తున అమరావతి వైపు ఆకర్షించేందుకు గాను ఆ ఒప్పందాలు ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కృష్ణానదిలోని రెండు దీవుల్లో 18 హోల్స్ గోల్ప్ కోర్సు, కన్వెన్షన్ సెంటర్, హోటళ్లు, రిసార్టులు అభివృద్ధి చేసేందుకు యుఎఇకి చెందిన బిఎల్ఎఫ్ కంపెనీతో ఎపి గవర్నమెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక దీవిలో 309 ఎకరాల్లో, మరో దీవిలో 99 ఎకరాల్లో ఈ ప్రాజెక్టులు రానున్నాయి. అటు రాజధానిలో 25 ఎకరాల్లో సినీస్టూడియో నిర్మాణానికి సిఆర్డిఏ అధికారులు డిపిఆర్ సిద్ధం చేశారు.
గురువారం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందం వివరాలు వెల్లడించారు. అబుదాబికి చెందిన బీఎల్ఎఫ్ కంపెనీ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని మునిసిపల్ శాఖ ఆయన చెప్పారు. ఈమేరకు బీఎల్ఎఫ్ సంస్థతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంటోందని ఆయన వెల్లడించారు.
కృష్ణానదిలోని 14 ద్వీపాల్లో 7 ద్వీపాలను అభివృద్ధి చేయడానికి బీఎల్ఎఫ్ సంస్ధ రెడీగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు. 3,500 ఎకరాలలో గోల్ఫ్ కోర్స్, రిసార్ట్స్.. కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే డీపీఆర్ ఇస్తామని బీఎల్ఎఫ్ సంస్ధ కూడా స్పష్టం చేసిందన్నారు. మరోవైపు అమరావతి బాండ్లు విజయవంతం అవ్వడంపై కొందరు ఓర్వలేక రకరకాల విమర్శలు చేస్తున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు.
దేశంలో అన్ని మునిసిపాలిటీల్లో బాండ్ల ద్వారా రూ.1800కోట్లు మాత్రమే వచ్చాయి...అయితే నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 1500 కోట్లతో అమరావతిలో రెండు రోడ్లు కూడా వేయలేమని నారాయణ తెలిపారు. అమరావతిలో మొత్తం రూ. 48వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ రకాల పద్ధతుల్లో అమరావతి అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అమరావతిలో రోడ్ కనెక్టివిటీ పూర్తి కావస్తుందని మంత్రి తెలిపారు. మార్చి నాటికి 4వేల ఇళ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి నారాయణ తెలిపారు.