షాక్: నెలాఖరులో రిటైర్మెంట్, డొల్ల కంపెనీల్లో రఘు పెట్టుబడులు?
అవినీతి అధికారులు రూట్ మార్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకొనేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
అమరావతి: అవినీతి అధికారులు రూట్ మార్చారు. అక్రమంగా సంపాదించిన డబ్బును కాపాడుకొనేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ అధికారి రఘు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన విషయాలు నివ్వెరపరుస్తున్నాయి.డొల్ల కంపెనీలను ప్రారంభిస్తూ ఆ కంపెనీల ద్వారానే డబ్బులు సంపాదించినట్టు అవినీతి అధికారులు చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ప్రజలకు సేవ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసే ఉద్యోగులపై నేరుగా ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసింది.
Recommended Video
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఏపీ ప్రభుత్వం అవినీతి అధికారులపై కేంద్రీకరించింది.అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేసేందుకు ఏసీబీ దాడులు ఉద్యోగుల్లో భయం కల్పిస్తాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీకి చిక్కిన ఉద్యోగుల్లో వందల కోట్ల ఆస్తులున్నవారే కావడం గమనార్హం.
ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి తీవ్రంగా నష్టపర్చేలా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని తేలింది. ఈ రకమైన ఉద్యోగులపై ఏసీబీ కన్నేసింది.
డొల్ల కంపెనీలతో ఆదాయం చూపుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఆధారంగా లంచాలు పుచ్చుకొని ఆస్తులను సమకూర్చుకోవడమే పనిగా పెట్టుకొన్నారు కొందరు ఉద్యోగులు. డబ్బులిస్తే ఎలాంటి పనైనా చేసేందుకు నిబంధనలను కూడ పక్కన పెట్టేస్తారు.అయితే అక్రమంగా సంపాదించిన ఈ డబ్బును రాజమార్గంలో సంపాదించినట్టు చూపేందుకుగాను డొల్ల కంపెనీలను సృష్టిస్తున్నారు.గతంలో ఏసీబీ అధికారులకు చిక్కిన పాండురంగారావే కాదు, ఇటీవల ఏసీబీకి చిక్కిన రఘురామిరెడ్డి కూడ డొల్ల కంపెనీలను సృష్టించారని అదికారులు గుర్తించారు. పాండురంగారావు తన కుమారుడి పేరిట కంపెనీ పెట్టారు. తమ కుటుంబానికి ఆ కంపెనీ లావాదేవీల ద్వారానే ఆదాయం వచ్చిందని అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు..టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘురామిరెడ్డి తన బినామీగా ఉన్న గాయత్రి ద్వారా ఏకంగా నాలుగు కంపెనీలు ఏర్పాటు చేశారు.
రిటైర్మెంట్కు ముందే ఏసీబీకి చిక్కిన రఘు
ఈ నెలాఖరులో రఘు ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గన్నవరం సమీపంలోని రావ్ ఫిన్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో నివసించాలని భావించారు. ఇదో గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ నల్లూరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు. శివప్రసాద్ కుటుంబం ఇటీవలే రావ్ఫిన్కు మకాం మార్చింది. అటు రఘురామి రెడ్డి, ఇటు బినామీ నల్లూరు శివప్రసాద్ ఇళ్లలో సోదాలు జరగడంతో ఆ ఆలయానికి వచ్చే భక్తుల్లో దీనిపైనే చర్చ జరుగుతుంది.
బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చారు
ఏసీబీ దాడులు చేయడానికి వారం ముందు గాయత్రి వద్ద ఉండే ఓ వ్యక్తి సూట్ కేసులతో అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలుస్తోంది. వాటిలో రూ.4 కోట్ల వరకు నగదు ఉన్నట్లు సమాచారం. ఆ వ్యక్తి కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు.ఇక... తిరుపతికి చెందిన మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన బ్లాంక్ చెక్ ఒకటి మంగళగిరిలోని కొండపనేని లేఔట్లోని రఘు నివాసంలో ఏసీబీకి లభించినట్లు తెలిసింది. మోహన్ రెడ్డి ఎవరు? రఘుకు బ్లాంక్ చెక్ ఎందుకు ఇచ్చారు? అనే విషయాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.
బినామీ ఖాతాల్లో పెట్టుబడులు
టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ రఘు బినామీల ఖాతాల్లో పెట్టుబడులు పెట్టేవారని అధికారులు గుర్తించారు. బినామీలతో ముందుగానే రఘు ఒప్పందాలు కుదుర్చుకునే వారంటున్నారు అధికారులు. బినామీలకు 30 శాతం వాటా ఇచ్చేవారని ప్రచారం సాగుతోంది. ఎప్పటికైనా ఏసీబీ వలలో చిక్కడం ఖాయమనే అంచనాతోనే తన అక్రమార్జనను బినామీల పేరిట కంపెనీల్లో వాటాలుగా మార్చినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. రఘు తన సర్వీసులో సుమారు 500 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అంచనా! ఏసీబీ సోదాల్లో రఘు ఇంట్లో లభించిన ఆభరణాలు, నగదుకంటే గన్నవరం సమీపాన ఉన్న చినఅవుటపల్లిలోని నల్లూరు శివప్రసాద్ ఇంట్లో గుర్తించిన డాక్యుమెంట్లు, ఆభరణాలే ఎక్కువగా ఉన్నాయి.