'జగన్ లో అసలు మానవత్వం ఉందా?.. తల్లిని, చెల్లిని నడిబజారులో నిలబెట్టాడు!'
జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం తల్లిని, చెల్లిని నడిబజారులో నిలబెట్టారని గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అగ్రిగోల్డ్ అంశంతో పాటు, ఓటుకు నోటు కేసుకు సంబంధించిన చార్జీషీటులో సుప్రీం చంద్రబాబు పేరు ప్రస్తావించడాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టాలని వైసీపీ పట్టుబడింది. దీంతో వైసీపీ వైఖరిని టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా తప్పుపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పక్కదోవ పట్టించేదని జగనే అని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు.
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం చంద్రబాబు వల్లే న్యాయం జరుగుతుందని గొల్లపల్లి అన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు భోజనానికి పిలిస్తే కూడా రాని వ్యక్తిని ఏమనాలి? అని ప్రశ్నించారు. అసలు జగన్ లో మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. అదే సమయంలో జగన్ కుటుంబ ప్రస్తావనను తీసుకొచ్చి విమర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి దశాబ్ధ కాలం రాజకీయాల్లో కొనసాగినా.. ఆయన భార్య విజయమ్మను తామెప్పుడూ చూడలేదన్నారు. కానీ జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం తల్లిని, చెల్లిని నడిబజారులో నిలబెట్టారని గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడం తగదు:
ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేస్తూ సభకు అడ్డుపడవద్దని ఎమ్మెల్యే కూనం రవికుమార్ వైసీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు.బీఏసీ నిర్ణయాల మేరకు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని అన్నారు. సభా ప్రయోజనాలను కాపాడేలా సభ్యులు హుందాగా వ్యవహరించాలని తెలిపారు.
కాగా, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై చర్చించాలని వైసీపీ నేతలు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు.