భద్రాచలం సీమాంధ్రకే: సవరణలివే, ఎల్లుండే పార్లమెంట్లో?
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లును ఈ పార్లమెంటు సమావేశాలలోనే ప్రవేశ పెట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మంత్రుల బృందం (జివోఎం) మంగళవారం భేటీ అయి కొద్దిపాటి సవరణలు చేసిన విషయం తెలిసిందే. జివోఎం కీలక సవరణలు చేసింది.
ఆ సవరణలతో కూడిన తెలంగాణ ముసాయిదా బిల్లును తదుపరి కేబినెట్ ముందు జివోఎం ఉంచనుంది. ఈ నెల 6వ తేదీన కేబినెట్ భేటీ కానుంది. ఆ రోజు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదనలను జివోఎం సిద్ధం చేసింది.
బిల్లులో కీలక సవరణలు చేసింది. సీమాంధ్రులకు పన్నుల నుండి మినహాయింపులు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ సవరణలు జివోఎం చేసింది. కొత్త రాజదాని నిర్మాణం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
పోలవరం నిర్మాణం కోసం భద్రాచలం డివిజన్ను సీమాంధ్రకు బదలాయించడం, పోలవరం నిర్మాణం, సీమాంధ్రలో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు, సీమాంధ్ర రాజధానికి తొలి విడతగా పదివేల కోట్ల రూపాయలు, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాష్ట్రానికి పదేళ్ల పాటు పన్నుల మినహాయింపు సహా కీలక అంశాల పైన మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన డివిజన్ సీమాంధ్రకు ఇవ్వాలని జివోఎం సూచించింది.
ఎల్లుండే బిల్లు తీసుకొస్తారా?
కాగా, తెలంగాణ బిల్లును వీలైనంత త్వరగా పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఈ నెల 6న పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశముందని అంటున్నారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో రెండో రోజే బిల్లును సభల్లోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని ఇప్పటికే పలువురు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.