ట్విస్ట్: తెరపైకి రాయల టి, చిరు యూటి! జివోఎం నో
న్యూఢిల్లీ: తెలంగాణ ముసాయిదా బిల్లులో సవరణలు చేయకుంటే పార్లమెటులో తాము వ్యతిరేకంగా ఓటు వేస్తామని సీమాంధ్ర కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు హెచ్చరించిన నేపథ్యంలో మంత్రుల బృందం (జివోఎం) వారిని దారిలోకి తెచ్చుకునే పని మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మంత్రుల బృంద సభ్యులు సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామిలు బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు హోంశాఖ కార్యాలయంలో సీమాంధ్ర కేంద్రమంత్రులతో చర్చించారు.
దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో కావూరి సాంబశివ రావు, చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్, పళ్లం రాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిల్లి కృపారాణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాదును యుటి చేయడం, రాయల తెలంగాణ అంశాలు మళ్లీ తెర పైకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
కర్నూలు, అనంతపురం జిల్లాలకు సరైన న్యాయం జరగాలంటే ఆ రెండు జిల్లాలను తెలంగాణలోకలపాలని కొందరు మంత్రులు ప్రతిపాదించగా, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల్సిందేనని మరికొందరు ప్రతిపాదించారని సమాచారం. పదేళ్ల పాటు హైదరాబాదు ఆదాయాన్ని ఇరు ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, వారి డిమాండ్లకు జివోఎం సభ్యుల నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం.
రాయల తెలంగాణ, హైదరాబాదును కేంద్రపాలిత పాలిత ప్రాంతంగా చేయడం, హైదరాబాదులోని ప్రవేశాల్లో పదేళ్ల కాలపరిమితి ఎత్తేయడం, పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో కలపడం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధానికి కేంద్రం ఆర్థిక సాయం వంటి డిమాండ్లు జివోఎం సభ్యుల ముందు మంత్రులు ఉంచారు.