టీడిపి కి మరో కాపునేత గుడ్ బై..! వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ...?
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఒక్క ఓటమితో సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కుదేలవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన మరుక్షణం చాలా మంది నేతలు పార్టీ వీడేందుకు ప్రణాళికలు రచించుకున్నారు. కొంత మంది ఎంపీలు ఆఘమేఘాల మీద పార్టీని విడిచి వెళ్లిపోయారు కూడా. మరికొంత మంది నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ లో సామాజీక వర్గాలుగా విడిపోయిన నేతలు ఏ పార్టీలోకి వెళ్తే తమ రాజకీయ భవిత ఆశాజనకంగా ఉంటుందో సమాలోచనలు జరుపుకుంటలున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గతంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నప్పుడు నలుగురు ఎంపీలు పార్టీ మారిపోయారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నారు. బాబు వచ్చే లోపు విజయవాడకు సెంట్రల్ కు చెందిన ఆ మాజీ కాపు ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైసీపీలో చేరతారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 'సెంట్రల్' లో ప్రస్తుతం మల్లాది విష్ణు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నందున, విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తామని ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. అయితే తూర్పు నియోజకవర్గ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన సుముఖంగా లేరని తెలిసింది.
తూర్పులో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బొప్పన భవకుమార్, ఎన్నికల ముందు వరకు ఆ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించిన యలమంచిలి రవి.. తదితర సీనియర్ నాయకులున్నందున.. ఆ నియోజకవర్గంలో తనకు తగిన సహకారం లభించదనే ఉద్దేశంతోనే ఆ బాధ్యతలను స్వీకరించడానికి ఉమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న బొండా ఉమామహేశ్వరరావు ఈ నెల 4, 5 తేదీల్లో నగరానికి తిరిగి రానున్నట్టు తెలిసింది.