ఏపీ ప్రభుత్వ స్కూళ్లకు మంచిరోజులు..! ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు స్పష్టమైన అంశాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని వేలాది స్కూళ్ల రూపురేఖల్ని ఏడాదిన్నరలో పూర్తిగా మార్చేస్తానని చెప్పటమే కాకుండా, కావాలంటే స్కూళ్ల ఫోటోలు తీసుకున్న తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత చూస్తే మార్పు మీకే తెలుస్తుందని జగన్ స్పష్టం చేస్తున్నారు. దానిని ఇప్పుడు నిజం చేసి చూపిస్తోంది ఏపి సర్కార్. దశాబ్దాల తరబడి ఎలాంటి నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా మారిపోయిన సర్కారీ స్కూళ్లను సరిచేయటం మామూలు విషయం కాదు. ఆ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న జగన్, అందుకు తగ్గట్లే సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. దశాబ్దాల తరబడి ఇష్టారాజ్యంగా ఉన్న సర్కారు స్కూళ్ల కారణంగా వేలాది కోట్ల ప్రజాధనం వృథా అవుతోంది. నిరుపేదలు తప్పించి మరెవరూ సర్కారీ స్కూళ్ల ముఖాలు చూడని పరిస్థితి. ఈ పరిస్థితిలో, స్కూళ్ల స్థితిగతుల్ని పూర్తిగా మార్చేసేందుకు వీలుగా కఠిన నిర్ణయాల దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి తగ్గట్లే ఆ శాఖా మంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
నాణ్యమైన విద్యను అందించటంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పిన ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్ చెప్పుకొస్తున్నారు. స్కూల్లో టీచర్లు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. పిల్లలకు చదువు చెప్పటం మానేసి ఎవరికి వారు వ్యక్తిగత ప్రయోజనాలకు చేకూరేలా వ్యాపారాలు చేయటం ఏమిటని ప్రశ్నించిన మంత్రి, అలా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే టీచర్ల మీద ఏసీబీ దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీలోని సర్కారీ స్కూళ్లను ప్రక్షాళన చేయాలంటే ఆ మాత్రం కఠినంగా ఉండటం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేస్తున్నారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వం వెచ్చిస్తున్న వేలాది కోట్ల ప్రజాధనానికి తగ్గ ఫలితం ప్రజలకు దక్కుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.