కష్టపడి పనిచేస్తే మంచి విందు...తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు:అధికారులతో సిఎం చంద్రబాబు
అమరావతి:శ్రీకాకుళం జిల్లాలో సహాయక చర్యలను ఈ నెల 29 లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న తిత్లీ తుపాను సహాయక చర్యలపై సిఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ తుఫాను సహాయక చర్యల్లో బాగా కష్టపడి పనిచేసే వారికి అవార్డులు ఇస్తామని వెల్లడించారు. అంతేకాకుండా ఇలా కష్టపడి పనిచేసినవారి కోసం తాను ప్రత్యేకంగా శ్రీకాకుళం వచ్చి వారికి మంచి విందు ఇస్తానని అన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లో ఎవరైనా తప్పుడు పనులకు పాల్పడితే వారికి కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.
చిత్తశుద్దితో...పనులు
తిత్లీ తుఫాన్ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ కు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ తుఫాన్ సహాయక చర్యల్లో అధికార యంత్రాంగమంతా చిత్తశుద్ధితో పనిచేస్తోందని కితాబునిచ్చారు. అన్ని పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
ఇంకా...ఇవి చేయాలి...
తుఫాన్ సహాయక చర్యల ఆరంభంలో ఉన్న కష్టాలను ఒక్కొక్కటిగా అధిగమించామని సిఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో రెండు రోజుల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. తుపాను ప్రభావిత 1802 గ్రామాల్లో ఇంకా 356 గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాల్సి ఉందని సిఎం ఈ సందర్భంగా వెల్లడించారు. 10 వేల టార్పాలిన్ పట్టాలు, జింక్ షీట్స్ను వెంటనే తెప్పించి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ పనులు జరుగుతున్నాయి...
పంట నష్టం అంచనాలను ఆదివారంలోగా పూర్తి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉద్యాన పంటల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బాధితులకు చెక్కుల పంపిణీ పూర్తయ్యేవరకూ అధికారులంతా అక్కడే ఉండాలని చెప్పారు. హుద్ హుద్తో పోలిస్తే చెక్కుల పంపిణీ ఇప్పుడే వేగంగా జరుగుతోందని తెలిపారు. 30 పాఠశాలల్లో చెట్ల తొలగింపు పూర్తి కావాల్సి ఉందన్నారు.365 తాగునీటి పథకాల్లో 363 పనిచేసే పునరుద్దరించడం జరిగిందన్నారు.
సహాయక చర్యలు...గణాంకాలు
సహాయక చర్యల్లో 363 జనరేటర్లు ఉపయోగిస్తున్నారని, 185 ట్యాంకర్లతో తాగునీటి రవాణా జరుగుతోందని, 293 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. తుఫాన్ విధుల్లో 13 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొంటున్నారని...350 బావుల్లో క్లోరినేషన్ పూర్తి చేశారని...శనివారం ఒక్కరోజే 1.35 లక్షల మందికి భోజనాలు, 52 వేల మందికి కోడిగుడ్ల పంపిణీ జరిగిందని చెప్పారు. చెట్ల తొలగింపు పనుల్లో 22 అగ్నిమాపక, 56 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయన్నారు. టెలీ కమ్యూనికేషన్స్ పనుల పునరుద్ధరణ పూర్తయిందన్నారు.
విరాళాలు...ఇలా ఇవ్వొచ్చు
ప్రస్తుతం సీఎం సహాయ నిధికి అందే విరాళాలన్నీతిత్లీ తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాల అభివృద్ధికే వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. దేశవిదేశాల్లో ఉన్నవారు సాయం అందించేందుకు వీలుగా వేర్వేరు చెల్లింపు విధానాలతో నవీకరించిన వెబ్సైట్ను సిఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. దాతలు ముందుకొచ్చి శ్రీకాకుళం తుపాను బాధితులను ఆదుకోవాలని కోరారు. విరాళాలిచ్చే వారికి ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందన్నారు. డబ్బు ఎపిసిఎంఆర్ఎఫ్.జివోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్కార్డులు, మొబైల్ వాలెట్, యూపీఐ, చెక్కుల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. విరాళాలు ఇచ్చిన వారికి సీఎం సంతకంతో ఆన్లైన్లో ప్రశంసాపత్రం జారీ అవుతుందని తెలిపారు.