ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ... ఇతర రాష్ట్రాలలోనూ ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించనున్న ఏపీ సర్కార్
ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో తమ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించనున్నామని పేర్కొన్నారు.
జనవరి 1 నుండి నూతన ఆరోగ్యశ్రీ పై పైలట్ ప్రాజెక్టు
రిటైర్డ్ ఐఎఎస్ అధికారి సుజాత రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆరోగ్యశాఖ ప్రక్షాళనకు చేపట్టాల్సిన సంస్కరణలపై నివేదిక అందించిన నేపధ్యం లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు వందకు పైగా సూచనలతో 182 పేజీల నివేదికను సమర్పించిన సుజాత రావు కమిటీ ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా కొన్ని వ్యాధులు తీసుకురావాలని ప్రతిపాదించిన నేపధ్యంలో జనవరి 1 నుండి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీపై పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులకు పెన్షన్ పథకం
పశ్చిమగోదావరిలో 2 వేల వ్యాధులను, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తున్నామన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఇక అంతేకాదు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడేవారికి పెన్షన్ అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో డయాలసిస్ చేయించుకున్న వారికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న జగన్
తలసేమియా, కుష్టువ్యాధి, పుట్టుకతో వచ్చే హెచ్ఐవి, బోధకాలు, పక్షవాతం బాధితులకు ఐదు వేల రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. వీలైనంత తొందరగా ఈ పెన్షన్ స్కీం అమలు చేయాలని దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ ఇచ్చే పథకం ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మొత్తానికి ఏపీ ప్రజల ఆరోగ్య సంరక్షణ కు పెద్ద పీట వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యశాఖ ప్రక్షాళనకు నడుం బిగించి ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రూరల్ సర్వీసులు , నూతన మెడికల్ కాలేజీలకు ఆమోదం
గతంలో మాదిరిగా మళ్ళీ రూరల్ సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పీజీ విద్యార్థులకే కాకుండా ఎంబీబీఎస్ విద్యార్థులకు కూడా రూరల్ సర్వీస్ ను తప్పనిసరి చెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం పాడేరు, విజయనగరం, ఏలూరు, గురజాల మెడికల్ కాలేజీలతో పాటు పులివెందుల, మర్కాపురం, మచిలీపట్నంలలోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు . అలాగే, ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీల భవనాలను తొలగించి కొత్తగా మల్టీస్టోర్డ్ భవనాలను నిర్మించాలని సీఎం నిర్ణయించారు.