ఏపీలో నిరుపేదలకు వరం: 20 రూపాయలకే ఇంటి పట్టా ఇవ్వాలనే నిర్ణయం
Recommended Video
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. ఏపీలో అన్ని వర్గాలవారికి ప్రాధాన్యత ఇచ్చేలా వివిధ పథకాలను అమలు చేస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏపీ ఖజానాకు భారంగా మారినప్పటికీ, ఏపీలో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి .తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మరో కీలక నిర్ణయం కూడా నిరుపేదలకు వరంగా మారనుంది.
నవరత్నాల అమలులో భాగంగా నిరుపేదలకు సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయం
నవరత్నాల్లో కీలకమైన స్కీమ్ గా భావించే పేదలందరికీ ఇళ్ళు అందించే పథకానికి సంబంధించి కొత్త రూల్స్ను జారీ చేశారు. కేవలం 20 రూపాయల ఖర్చుతో నిరుపేదలంరికీ ఒక సెంటు భూమి ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వడం వల్ల ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక నిరుపేద లందరికీ జీ+3 అంతస్తుల అపార్ట్మెంట్లను నిర్మించి అందులో ఫ్లాట్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇచ్చే యోచన
నిరుపేదలు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలనుకునేవారు తమ రేషన్ కార్డు జిరాక్స్నుప్రూఫ్గా ఇచ్చి ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . ఇక పట్టా చేతికి వచ్చేసరికి కేవలం 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అటు రేషన్ కార్డు లేనివారు కూడా.. మీసేవ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్నది జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది . దానికి అనుగుణంగా అధికారులు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.
ఖాళీగా ఉన్న భూముల వివరాలు అందించే పనిలో తహసీల్దార్లు
ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇక తహసీల్దారులు ఖాళీగా ఉన్న భూములు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. అంతేకాకుండా అక్రమాలకు తావు లేకుండా లబ్దిదారులకు స్థలాలను కేటాయించాలని నిర్ణయం తీసుకున్న సర్కార్ లబ్ధిదారుల ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాల్ని దానితో లింక్ చేస్తారు. ఇక దీనికి మాత్రమే రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్కు ఖర్చు అవుతుంది.
పేదల సొంతింటి కల నెరవేర్చే ఆలోచనలో ఏపీ సర్కార్
ఈ ఖర్చు మాత్రమే లబ్ధిదారుల నుండి తీసుకోనున్నారు. ఈ భూమి ఇచ్చిన తర్వాత ఐదేళ్ల పాటు ఎవరికీ నమ్మకూడదని నిబంధన ఉంది. ఆ తర్వాత నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తారు. ఐదు సంవత్సరాల తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఇక ఈ స్థలాన్ని పొందిన వారి వివరాలు వార్డులలో, గ్రామ సచివాలయంలో పొందుపరుస్తారు. మొత్తానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుపేదల సొంతింటి కల నెరవేరబోతోంది.