ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ - పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన : ఫిట్ మెంట్ పై నేటి చర్చల్లో..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పీఆర్సీ పైన పది రోజుల్లో ప్రకటన చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో బాధితులను పరామర్శిస్తున్నారు. సరస్వతీ నగర్ లో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలిసారు. పీఆర్సీ పైన ప్రకటన చేయాలని వారు కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే వేతన సవరణ పైన ప్రక్రియ పూర్తి చేసామని.. పది రోజుల్లో అధికారిక ప్రకటన వస్తుందని చెప్పారు.
ఈ నెలలో పీఆర్సీ అమలు ప్రకటన
అక్టోబర్ నెలాఖరు నాటికే పీఆర్సీ పైన స్పష్టత ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. అయితే, అది అమలు కాలేదు. దీంతో..ఉద్యోగ సంఘాలు కనీసం తమకు పీఆర్సీ నివేదిక అయినా ఇవ్వాలని కోరుతూ వచ్చాయి. అందుకు సైతం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో..ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యోగ సంఘాలు పోరు బాట పట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చాయి. ఈ రోజున మరో సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది.
ఈ రోజు జరిగే సమావేశం కీలకంగా
ఈ రోజు మధ్నాహ్నం జరిగే ఈ సమావేశంలో పీఆర్సీ కమీషన్ సిఫార్సు చేసిన అంశాలను ప్రభుత్వం ముందు ఉంచే అవకాశం కనిపిస్తోంది. అందులో వేతన సవరణ సంఘం ఎంత మేర ఫిట్ మెంట్ ప్రతిపాదించిందీ... హెచ్ఆర్ఏ..కనీస వేతనం వంటి అంశాల పైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. వీటి పైన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు పిట్ మెంట్ తాము ఎంత డిమాండ్ చేస్తుందీ వివరించేందుకు సిద్దంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ ప్రకటించి..అమలు చేస్తోంది.
ప్రభుత్వం ఇచ్చేదెంత..ఉద్యోగులు అడిగేదెంత
ఏపీ ఉద్యోగ సంఘాలు 40 శాతం వరకు డిమాండ్ చేసేందుకు సిద్దం అవుతున్నాయి. అయితే, ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఆర్దిక పరిస్థితులను ఉద్యోగ సంఘాలకు వివరించి...ఎంత మేరకు ఒప్పిస్తారనేది వేచి చూడాలి. ఇక, ఈ రోజు సమావేశంలో ప్రతిపాదనలు బయటకు వచ్చిన తరువాత... అటు ప్రభుత్వం - ఇటు ఉద్యోగ సంఘాల మధ్య పీఆర్సీ ప్రకటన .. ఫిట్ మెంట్ ఖరారు పైన పలు విడతల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. చివరగా ముఖ్యమంత్రి జగన్ వద్ద ఈ ఫిట్ మెంట్ ఫైనల్ గా ఎంత అనేది తేలనుంది.
Recommended Video
ముఖ్యమంత్రి హామీలో ఉద్యోగుల్లో ఆశలు
ఈ మొత్తం ప్రక్రియ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా పది రోజుల్లో తేలుతుందా.. లేక, నెలాఖరు లో ప్రకటిస్తారా అనేది వేచి చూడాలి. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి పీఆర్సీ పైన ప్రకటన చేయటం.. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని చెప్పటంతో ఉద్యోగుల్లో ఆశాభావం వ్యక్తం అవుతుంది. పెన్షనర్లు సైతం పీఆర్సీ పైన ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. పీఆర్సీ పైన ప్రభుత్వ ఆలోచన.. ఉద్యోగ సంఘాల స్పందన పైన సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.