సొంత పార్టీలో ఫలించింది..! అదికార పార్టీలో వికటించింది..!! అదే జగన్ చతురత..!
అమరావతి/హైదరాబాద్ : అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికలో వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, జనసేన, టీడీపీల నుంచి ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా నేతలను ఎంపిక చేశారు. ఇప్పటి వరకూ ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలుగా పనిచేస్తున్న నేతలు, గత ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థుల నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురవకుండా ముందస్తు సర్దుబాట్లు పార్టీకి మరింత మేలు చేశాయనే చర్చ జరుగుతోంది. అంతే కాకుండా జగన్ ముందస్తు అభ్యర్థుల ప్రకటన అదికార పార్టీలో కొంత మంది నేతలకు ఆందోళనగా పరిణమించినట్టు తెలుస్తోంది.
డ్రీం క్యాబినెట్ - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
కలిసొచ్చిన అభ్యర్థుల ప్రకటన..! వైసీపిలో ఉప్పొంగుతున్న జోష్..!!
వాస్తవానికి వైసీపీ ఒకేసారి అభ్యర్థుల పేర్లు ప్రకటించగానే, ఏపీలో రచ్చ మొదలవుతుందని.. ఇది తమకు అనుకూలంగా మారుతుందనే అంచనాల్లో ఉన్న ప్రత్యర్థులకు ఇది ఊహించని షాక్గానే చెప్పాలి. పీకే అండ్ టీమ్ జరిపిన సర్వేలు.. చేసిన అధ్యయనాలను లెక్కగట్టి, చివరగా వడబోతలో తేల్చిన అభ్యర్థుల గెలుపు సునాయాసమనే ఆత్మవిశ్వాసం జగన్లో కనిపిస్తోంది.
మారిన జగన్ వ్యక్తిత్వం..! సమిష్టి నిర్ణయాలు తీసుకుంటున్న యువనేత..!!
పైగా గతానికి భిన్నంగా తాను మారాననే సంకేతాలు ఇచ్చేందుకు మీడియా సమావేశాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఎమోషన్గా ఆచితూచి స్పందిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ తనకు టికెట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానంటూ విడుదల చేసిన సెల్ఫీవీడియోను చాలా లైట్ గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో కనబరచిన.. అతి విశ్వాసం ఎక్కడా కనబడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఆచితూచి అభ్యర్థుల ఎంపిక..! గెలుపే లక్ష్యంగా ప్రచారం..!
కడప, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ దఫా కుల సమీకరణలను కేంద్రంగా చేసుకుని వైసీపీ అభ్యర్థుల ఎంపిక చేసింది. ముఖ్యంగా కుల ప్రభావం అధికంగా ఉండే కోస్తా జిల్లాల్లో గతానికి భిన్నంగా ఈ దఫా.. కమ్మ వర్గానికి ప్రాధాన్యతనిచ్చారు. సీమ జిల్లాల్లో టీడీపీ రెడ్లలో చీలిక తెచ్చి లాభపడదామని వేసిన ప్లాన్ను.. జగన్ కోస్తా జిల్లాల్లో కమ్మ వర్గాన్ని రెండు చీల్చటం ద్వారా సమానం చేసినట్టుగా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అందరివాడులా కనిపిస్తున్న జగన్..! ప్రజామోదమే తరువాయి..!!
జగన్పై ఉన్న కుల ముద్రను చెరిపివేసేందుకు తొలి జాబితాలోనే బీసీ, ఎస్సీ, ఇతర వర్గాలు ఉన్నాయనే సంకేతాలు పంపారు. ఇవన్నీ జగన్ ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారనేందుకు నిదర్శనంగానే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో కత్తికేసు, డేటాచోరీ, వివేకానంద హత్య ఘటనలు జగన్ ను చిరాకు పెట్టినా.. నష్టపరచలేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఏపీ హోదా విషయంలో మొదటి నుంచి ఒకేమాటపై కట్టుబడి ఉన్న నేతగా జగన్ను జనం ఆమోదిస్తున్నారనే భరోసాతో వైసీపీ నేతలు కనిపిస్తున్నారు.