విజయవాడలో అల్లరి మూకల వీరంగం: తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి.. డ్రైవర్ను కొట్టి..నగదు లూటీ!
విజయవాడ: విజయవాడలో శనివారం అర్ధరాత్రి కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. డ్రైవర్ను చితకబాదారు. రక్తమోడేలా కొట్టారు. వారి దెబ్బలకు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన వద్ద ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్ను ధ్వంసం చేశారు. 25 వేల రూపాయల నగదును లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై భవానీపురం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
నార్కట్పల్లి డిపో బస్సుపై..
తెలంగాణలోని నార్కట్పల్లి డిపోనకు చెందిన సర్వీస్ నంబర్ 1693 సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు సుమారు 15 మంది ప్రయాణికులతో రాత్రి విజయవాడకు బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బస్సు విజయవాడ శివార్లకు చేరుకుంది. ఆ సమయంలోనే ఈ దాడి చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకులు బస్సుకు అడ్డంగా తమ బైక్లను ఆపారు. దాడికి పాల్పడ్డారు.
ఓవర్ టేక్కు స్థలం ఇవ్వకపోవడమే కారణమా?
దీనికంతటికీ- ఆ యువకులు తమ బైక్ల ద్వారా ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయడానికి చోటు ఇవ్వలేదనేది ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. ఓవర్ టేక్ చేయడానికి డ్రైవర్ స్థలం ఇవ్వలేదనే అక్కసుతో ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. డ్రైవర్ను బూతులు తిడుతూ, గట్టిగా అరుస్తూ ఆ యువకులు బస్సు లోనికి దూసుకెళ్లారు. వెళ్తూ, వెళ్తూనే డ్రైవర్ చొక్కా పట్టుకుని కిందికి లాక్కొచ్చారు. ఇనుప రాడ్లతో డ్రైవర్ను గాయపరిచారు. ఆయన తలపై కొట్టారు. దీనితో రక్తం ధారగా కారింది. ఆయన దుస్తులన్నీ రక్తసిక్తం అయ్యాయి.
మద్యం మత్తులో..
ఘటన సమయంలో వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరి చేతుల్లో మద్యం సీసాలు కూడా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ వద్ద ఉన్న టిమ్స్ ను రోడ్డుకేసి విసిరకొట్టడంతో అది ధ్వంసమైంది. ప్రయాణికుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేసిన సుమారు 25 వేల రూపాయలను లాక్కుని పరారయ్యారు వాళ్లంతా. ఆ యువకుల అరుపులు, కేకలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకునే టప్పటికే యువకులు మాయం అయ్యారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కాకతాళీయమా? ఉద్దేశపూరకమా?
ఈ ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాడి వెనుక ఉన్న కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ ఘటన వెనుక కాకతాళీయంగా చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా జరిగిందా? దీని వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒకేసారి 20 బైక్లు, ఇంచుమించు 50 మంది యువకులు ఈ దాడిలో పాల్గొనడం అసాధారణంగా కనిపించే అంశం. అంతమంది ఒకేసారి ఎలా గుమికూడారనే విషయం అనుమానాలను రేకెత్తిస్తోంది. వారాంతపు రోజు కావడం వల్ల సమీపంలోని ధాబాల వద్ద గుమికూడి, మద్యాన్ని సేవించి ఉండొచ్చని చెబుతున్నారు.