జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మద్దాల
పశ్చిమగోదావరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే మద్దాల సునీత శుక్రవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆమెతోపాటు వందలాది మంది ఆమె అనుచరులు పార్టీలో చేరారు. తాను వైసీపీ బలోపేతం కోసం పనిచేస్తానని ఆమె ఈ సందర్భంగా అన్నారు. గతంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, రాజుపాలెం గ్రామంలో జగన్ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. స్థానికంగా అధికంగా ఉన్న డయాలిసిస్ వ్యాధి గ్రస్తులు జగన్ను కలుసుకుని తమ సమస్యలను చెప్పుకున్నారు.
ఆ తర్వాత మారంపల్లిలో జగన్ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కష్టాలు ఉండవని, పిల్లలంతా చదువుకునేలా చూస్తానని అన్నారు.