'పెళ్ళికి పిలవాలనుకొన్నా.. కానీ, చావుకే అందరినీ ఆహ్వనిస్తున్నా'
అనంతపురం: రెండు నెలల్లో పెళ్ళి జరగాల్సి ఉండగా, మనోవేదనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తాను ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. వాట్సాప్ లో కూడ తన సూసైడ్ లేఖను పోస్ట్ చేశాడు. పెళ్ళికి అందరిని పిలవాలనుకొన్నా, కానీ, చావుకు పిలవాల్సి వస్తోందనుకోలేదని సూసైడ్ లేఖలో గోవర్ధన్ అలియాస్ గోపి ఆవేదన వ్యక్తం చేశారు.
యాడికి మండలం చందన గ్రామానికి చెందిన సూర్యనారాయణ దంపతులకు గోవర్థన్ ఒక్కడే కొడుకు.ఇంటర్ వరకు చదువుకొని ఆటో నడుపుతూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు గోవర్థన్.
గోపికి గత ఆగష్టులో వివాహం నిశ్చయమైంది. అయితే ఆ సమయంలో యువకుడి పెదనాన్న చనిపోయాడు. దీంతో వివాహం వాయిదా వేశారు. అయితే గోపికి బట్టతల ఎక్కువైపోయింది.
దీంతో వివాహనికి పెళ్ళి కూతురు ఆసక్తి చూపలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొంటానని ఇంట్లో చెప్పి గోపిఅనంతపురానికి చేరుకొన్నాడు. అనంతపురంలో ఓ లాడ్జీలో గది అద్దెకు తీసుకొన్నాడు.
శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకొంటున్నట్టు చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు గోపి అద్దెకు తీసుకొన్న లాడ్జీకి చేరుకొనే సమయానికి ఆయన చనిపోయాడు.
చనిపోయే ముందు గోపి ఆరు పేజీల సూసైడ్ లేఖ రాశాడు. ఆ లేఖను పేస్ బుక్లో పోస్ట్ చేశారు. వాట్సాప్ లో షేర్ చేశారు. పెళ్ళికి అందరిని పిలవాలనుకొన్నాను. కానీ, చావుకు పిలవాల్సివస్తోందనుకోలేదని ఆయన ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.