నాశనం, ముగ్గురు మోడీలు దోచుకుంటున్నారు: ప్రధానిపై టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంగళవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాఫెల్ యుద్ధ విమానాలలో మోడీ అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో బోఫోర్స్ కుంభకోణం ద్వారా కాంగ్రెస్ పార్టీ రూ.16 వేల కోట్ల అవినీతికి పాల్పడితే రాఫెల్ కుంభకోణం ద్వారా బీజేపీ రూ.30 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందన్నారు.
'కాంగ్రెస్ను బాబు కలవరు, మోడీ ఎలా వంచించారో చెప్తారు': బాబు అంత తెలివితక్కువవాడు కాదని జేసీ
బ్యాంకింగ్ వ్యవస్థను మోడీ సర్వనాశనం చేశారన్నారు. బీజేపీ నేతలే అతి పెద్ద దోపిడీదారులన్నారు. పెట్రోల్ ధరలను ప్రతి రోజూ సమీక్షించుకునే విధానం ద్వారా కేంద్ర ఖజానాకు లక్షల కోట్లను జమ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీ నుంచి పన్నుల రూపంలో ఎంతో పోగేసుకుంటున్న కేంద్రం తిరిగి ఏపీకి ఏం ఇస్తోందో చెప్పాలన్నారు.
గుజరాత్ లో చోటు చేసుకున్న అవినీతిపై కాగ్ ఇచ్చిన నివేదికపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసాన్ని అడ్డుకునేందుకే అన్నాడీఎంకే ఎంపీలతో లోకసభలో బీజేపీ ఆందోళన చేయిస్తోందన్నారు. ముగ్గురు మోడీలు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.