సీఎం గురించి మాట్లాడితే నీ అంతు చూస్తా -ఎంపీ మాధవ్ బెదిరించారు : రఘురామ ఫిర్యాదు..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు తన సహచర ఎంపీ పైన స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ.. పరోక్షంగా ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ వచ్చిన రఘురామ రాజు కొద్ది రోజులుగా పార్టీలోని ముఖ్య నేతలను టార్గెట్ చేసారు. సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్ దాఖలు చేసిన తరువాత వైసీపీ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ మరింత సీరియస్ గా మారింది. ఇక..రఘురామ డైరెక్టర్ గా ఉన్న సంస్థల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మళ్లించారని..అందులో సీబీఐ సరిగ్గా దర్యాప్తు చేయటం లేదంటూ పార్టీ ఎంపీల సంతకాలతో విజయ సాయిరెడ్డి రాష్ట్రపతి- ప్రధానికి లేఖలు పంపారు.
వైసీపీ నేతల పైన రఘురామ ఆగ్రహం..
దీంతో..వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి పైన రఘురామ తీవ్రంగా స్పందించారు. ఆ లేఖలో రఘురామ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని...ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పైన సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇక, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. లోక్ సభలో ప్రతిపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది.
గోరంట్ల మాధవ్ దూషించారంటూ..
ఆ సమయంలో రఘురామ రాజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి వెళ్లారు. అక్కడ తన వద్దకు వచ్చిన హిందూపూర్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్యంగా తనతో మాట్లాడారని.. ఇక మీడియా సమావేశాలు పెట్టినా.. సీఎం గురించి మాట్లాడినా అంతు చూస్తానని బెదిరించారని రఘురామ రాజు ఆరోపించారు. ఆ సమయంలో కాంగ్రెస్..బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. అక్కడ ఇతర ఎంపీలు ఉండటంతో తాను స్పందించలేదని చెప్పారు. తాను వెంటనే స్పీకర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా రఘురామ చెప్పుకొచ్చారు.
సీసీ కెమేరాల్లో విజువల్స్ ఉన్నాయని..
సెంట్రల్ హాల్ లో సీసీ కెమేరాల్లోని ఫుటేజ్ చూసినా గోరంట్ల మాధవ్ తన తో ఎటువంటి హావభావాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారో అర్దం అవుతుందన్నారు. ఆ కెమేరాల్లో ఆయన ఏమన్నారో వినిపించకపోయినా...ఆయన బాడీ లాంగ్వేజ్ అర్దం అవుతుందని వివరించారు. సీఎం ఈ రకంగా తనపైన మాధవ్ తో మాట్లాడించారా.. లేక సీఎం ను ప్రసన్నం చేసుకొనే క్రమంలో మాధవ్ మాట్లాడారా అంటూ రఘురామ సందేహం వ్యక్తం చేసారు. ఈ విషయంలో తాను వెనుకడుగు వేసేది లేదని ..స్పీకర్ సైతం తన ఫిర్యాదు పైన సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఉందని రఘురామ ధీమాగా చెబుతున్నారు.
మాధవ్-స్పీకర్ స్పందన పై ఆసక్తి..
అయితే, దీని పైన ఇప్పటి వరకు గోరంట్ల మాధవ్ స్పందించ లేదు. పార్లమెంట్ ప్రాంగణంలోనే ఈ రకంగా వ్యవహరించారని..ఆయన పైన చర్యల కోసం తాను అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళ్తానని రఘురామ చెబుతున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతల తీరు పైన రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు రఘురామ రాజు చేస్తున్న ఆరోపణల పైన గోరంట్ల మాధవ్ ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇక, స్పీకర్ సైతం రఘురామ రాజు ఇచ్చిన ఫిర్యాదు పైన ఎలా రియాక్ట్ అవుతారనేదీ ఆసక్తి కరంగా మారుతోంది.