"జగన్ లాంటి చెత్త నాయకుడు ఇంకెక్కడా లేడు.."
హైదరాబాద్ : ప్రత్యేక హోదా అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూనే.. ప్యాకేజీని స్వీకరించడానికి టీడీపీ ప్రభుత్వం రెడీ అయిపోవడంతో.. వైసీపీ గట్టిగా ప్రతిఘటిస్తోంది. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభను స్తంభించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు.
ఇదిలా ఉంటే.. పదే పదే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా సాంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వట్లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ అధినేత జగన్ పై విమర్శల వర్షం కురిపించారు.
జగన్ లాంటి చెత్త నాయకుడిని దేశంలో మరెక్కడా చూడలేదంటూ బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఏవో మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లున్నారని ఎద్దేవా చేశారు బుచ్చయ్య చౌదరి. పదే పదే స్పీకర్ పోడియాన్ని ముట్టడించి సమావేశాలకు అడ్డుపడడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. వైసీపీ నేతలు మొండిగా వ్యవహరిస్తూ సభలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
ఇక కేంద్రం ఇచ్చే ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ.. ప్యాకేజీ తీసుకుంటామని, అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు బుచ్చయ్య చౌదరి.