ఇంగితజ్ఞానం: పురంధేశ్వరిపై గోరంట్ల తీవ్ర వ్యాఖ్యలు, బాబు క్లాస్ పీకినా..
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బిజెపి నేత, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి పైన మంగళవారం నాడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురంధేశ్వరికి ఇంగిత జ్ఞానం లేదని విమర్శించారు. బడ్జెట్ విషయంలో టిడిపి, బిజెపి నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు.
పోలవరం ప్రాజెక్టు పైన సందేహాలు ఉన్నాయని, వాటికి సంబంధించిన లెక్కలు కేంద్రానికి పంపించలేదని, అందుకే పోలవరంకు రూ.1200 కోట్లు అడిగితే, రూ.100 కోట్లు ఇచ్చారని పురంధేశ్వరి అన్నారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేయదని చెప్పారు. దీనిపై గోరంట్ల స్పందించారు.
పురంధేశ్వరి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరానికి నిధులు ఇవ్వాల్సింది కేంద్రమేనని ఆయన అన్నారు. నిధులు ఇవ్వని కేంద్రాన్ని తప్పుబట్టకుండా చంద్రబాబును విమర్శించడంలో అర్థం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పురంధేశ్వరికి చంద్రబాబు డోర్స్ క్లోజ్ చేయడం వల్లే బిజెపిలో చేరారన్నారు.
కాగా, బిజెపి నేతలు ఏం మాట్లాడినా సంయమనం పాటించాలని టిడిపి నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు గతంలోనే క్లాస్ పీకారు. అయినప్పటికీ గోరంట్ల తాజాగా పురంధేశ్వరి పైన ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: ఉమాభారతి
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి మంగళవారం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేది లేదని ఆమె స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉంటే తాము పరిష్కరిస్తామని చెప్పారు.